శ్రీనివాస్ కూకట్ల ఆధ్వర్యంలో అద్దంకిలో ‘తానా చైతన్య స్రవంతి’

బాపట్ల జిల్లా అద్దంకిలో ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్‌ కూకట్ల ఆధ్వర్యంలో డిసెంబరు 23 నుంచి 27 వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

Published : 08 Jan 2023 21:40 IST

అద్దంకి: బాపట్ల జిల్లా అద్దంకిలో ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్‌ కూకట్ల ఆధ్వర్యంలో డిసెంబరు 23 నుంచి 27 వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. తెలుగు వారు గర్వపడేలా తానా మహాసభలు జులై 7, 8, 9 తేదీల్లో అమెరికాలోని పిలదెల్పియాలో జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ‘తానా చైతన్య స్రవంతి’ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అద్దంకిలో తానా, కూకట్ల ఫౌండేషన్‌, తానా ఫౌండేషన్‌, పలువురు దాతల సహకారంతో ఐదు రోజుల పాటు వైద్య శిబిరాలు, క్రీడా పోటీలు, రైతు సేవా కార్యక్రమాలు, వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ, ల్యాప్‌టాప్‌ల బహుకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  

తానా కో-ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ కూకట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ జనార్ధన్‌ నిమ్మలపూడి,  చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పాంట్ర, తానా టెంపుల్‌ కో-ఆర్డినేటర్‌ జగదీశ్వరరావు పెద్దిబోయిన, అప్పలాటిన్‌ రీజినల్‌ రిప్రెజెంటేటివ్‌ నాగ పంచుమర్తి, తానా స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ శశాంక్‌ యార్లగడ్డ, పలువురు ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు.

సింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న తానా టీం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామి వారిని అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్‌ కూకట్ల, జనార్ధన్‌ తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ ఛైర్మన్‌ కోటా శ్రీనివాస్‌, వేదపండితులు స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఛైర్మన్‌ విజ్ఞప్తి మేరకు దేవస్థానానికి 120కేవీ జనరేటర్‌ను తానా ఫౌండేషన్‌, కూకట్ల ఫౌండేషన్‌ తరఫున అందజేసేందుకు హామీ ఇచ్చారు. 

శ్రీనివాస్‌ కూకట్ల అద్దంకి శ్రీమంతుడు: అంజయ్య చౌదరి

తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. కూకట్ల ఫౌండేషన్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ కూకట్ల అద్దంకి ప్రాంత శ్రీమంతుడని కొనియాడారు. ఇలాంటి వ్యక్తి అద్దంకిలో ఉండటం ఈ ప్రాంత వాసులకు గర్వకారణమన్నారు. తానా డైరెక్టర్‌ జనార్ధన్‌ మాట్లాడుతూ.. కూకట్ల సోదరులు శ్రీనివాస్‌, వెంకటకృష్ణ, హరీష్‌ చౌదరిల సేవా  దృక్పథాన్ని కొనియాడారు. అద్దంకి ప్రాంత ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు కూకట్ల సేవలను అభినందించారు. శ్రీనివాస్‌ కూకట్ల మాట్లాడుతూ.. కన్నతల్లికి, పుట్టిన గ్రామానికి సేవ చేయడం కన్నా మంచి కార్యక్రమం మరొకటి లేదన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులైన తల్లిదండ్రులు సుబ్బారావు, విద్యావళిలను సత్కరించారు. 

క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు అద్దంకిలో కూకట్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ ఆవేర్నెస్‌ వాక్‌ నిర్వహించారు. అద్దంకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. డిసెంబర్ 25న అద్దంకిలోని కూకట్ల కన్వెన్షన్ హాల్లో క్యాన్సర్, కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. కూకట్ల ఫౌండేషన్, Grace క్యాన్సర్ Foundation ఆధ్వర్యంలో వైద్యులు 115 మందికి క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒంగోలు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 60 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. 

అద్దంకికి చెందిన ఎన్‌ఆర్‌ఐ చట్టబత్తిన కృష్ణ కిశోర్‌ డొనేట్‌ చేసిన 25 పవర్‌ స్పేయర్లు, కూకట్ల ఫౌండేషన్‌, సురేష్‌ జాగర్లమూడి సహకారంతో 170 రైతు రక్షణ కిట్లను రైతులకు పంపిణీ చేశారు. సుమారు 100 మంది వృద్ధులకు దుప్పట్లు, 10 ట్రై సైకిళ్లు, బ్యాటరీతో నడిచే సైకిళ్లు రెండు పంపిణీ చేశారు. విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ల రూపంలో రూ.లక్ష పంపిణీ చేశారు. తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల ముగింపు సందర్భంగా కూకట్ల కన్వెన్షన్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్థానిక బెల్ అండ్ బెన్నెట్ పాఠశాల విద్యార్థులతో పాటు, పలు కళాబృందాలు, విజయవాడ సిద్దార్థ మహిళా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఫోక్ ఆర్కెస్ట్రా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని