NRI TDP: షికాగోలో పరిటాల శ్రీరామ్‌కి ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అభివృద్ధి బాట పట్టాలంటే జగన్‌ అరాచక పాలనకు చరమగీతం పాడి తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ యువనేత, ధర్మవరం ఇన్‌ఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పిలుపునిచ్చారు.

Published : 04 Jul 2023 12:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అభివృద్ధి బాట పట్టాలంటే జగన్‌ అరాచక పాలనకు చరమగీతం పాడి తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ యువనేత, ధర్మవరం ఇన్‌ఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. అమెరికాలోని షికాగోలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత షికాగో చేరుకున్న శ్రీరామ్‌కు ఎన్‌ఆర్‌ఐ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం షికాగో సిటీ తెలుగు ఎన్‌ఆర్‌ఐలతో పాటు పరిటాల, తెదేపా అభిమానుల హర్షాతిరేకాల మధ్య  ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ కోఆర్డినేటర్‌ కోమటి జయరాం, షికాగో తెదేపా నేతలు హేమకానూరు, ఎన్‌ఆర్‌ఐ తెదేపా కమిటీ సభ్యుల ఆధ్వర్యలో ఈ సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో షికాగో తెదేపా అధ్యక్షుడు రవి కాకర్ల ప్రారంభోపన్యాసం చేశారు. ఆ తర్వాత రవి ఆచంట, అజాద్‌, కాశి పాతూరి, మదన్‌ పాములపాటి, శ్రీనివాస్‌ పెదమల్లు, ఉమ కటికి, చాందినీ దువ్వూరి, రఘు చిలుకూరి, వెంకట్‌ యలమంచిలి, చిరు గళ్ల, హరీశ్‌ జమ్ముల, శ్రీనివాస్‌ ఇంటూరి, శ్రీనివాస్‌ అట్లూరి, వెంకట్‌ చిగురుపాటి, మనోజ్‌ తదితరులు మాట్లాడారు. అనంతరం పరిటాల శ్రీరామ్‌ ప్రసంగించారు. 

ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని ఆ మహా నాయకుడు తెచ్చిన విప్లవాత్మక మార్పులు, సంక్షేమ కార్యక్రమాలను పరిటాల శ్రీరామ్‌ వివరించారు. అనంతరం చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఐటీ కంపెనీలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చంద్రబాబు చేసిన కృషి,  ఎంతోమంది ఎన్‌ఆర్‌ఐలుగా స్థిరపడేందుకు దోహదపడిన అంశాలను శ్రీరామ్‌ వివరించారు. నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర ఓ ప్రభంజనంలా సాగుతోందని చెప్పారు. తెదేపా ప్రభుత్వం హయాంలో అనంతపురం జిల్లాలో జరిగిన అభివృద్ధి, కియా పరిశ్రమ ద్వారా 30వేల మందికి పైగా ఉపాధి, హార్టికల్చర్‌ అభివృద్ధి ద్వారా రాయలసీమకు విదేశాల నుంచి ఎగుమతులు జరిగాయని తెలిపారు. 

ఇటీవల తెదేపా ప్రకటించిన మినీ మేనిఫెస్టో.. మహిళా సాధికారత, నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు, రైతులకు వెన్నెముకగా నిలుస్తుందని శ్రీరామ్‌ చెప్పారు. పరిటాల మెమోరియల్ ట్రస్ట్‌ ద్వారా పుట్టిన నేలలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా వాటర్‌ ట్యాంకుల నిర్మాణం పనులు చేపట్టామని తెలిపారు. తన తండ్రి పరిటాల రవీంద్ర వారసత్వంగా బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తామని చెప్పారు. రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావాలంటే ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చి ప్రజల్ని చైతన్య పరచాలని కోరారు. 

ఈ కార్యక్రమానికి మిల్వాకీ, మాడిసన్‌, బ్లూమింగ్టన్‌ నుంచి అభిమానులు తరలివచ్చి కార్యక్రమానిన్ని విజయవంతం చేశారని ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేతలు తెలిపారు. షికాగో ఎన్‌ఆర్‌ఐ తెదేపా ప్రెసిడెంట్ రవి కాకర్ల, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ పెదమల్ల్ఉ, సెక్రటరీ వెంకట్‌ యలమంచిలి, ట్రెజరర్‌ విజయ్‌ కోరపాటి, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ రఘు చిలుకూరి, రీజనల్‌ కౌన్సిలర్‌ చిరంజీవి గళ్ల, రవినాయుడు, కృష్ణమోహన్‌ చిలమకూరు, హను చెరుకూరి, ప్రదీప్‌ యలవర్తి, సందీప్‌ ఎల్లంపల్లి, లక్ష్మణ్‌ తదితరుల సహకారంతో హేమ కానూరు అన్నీ తానై  ఉత్సహంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని