ఎన్టీఆర్‌ జయంతిని ఆత్మగౌరవ దినంగా ప్రకటించాలి.. జాక్సన్‌విల్లేలో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

ఎన్టీఆర్ జయంతిని ఆత్మగౌరవ దినంగా ప్రకటించాలని తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విల్లే నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 12వ మహానాడు నిర్వహించారు

Published : 01 May 2023 19:56 IST

జాక్సన్ విల్లే (అమెరికా): ఎన్టీఆర్ జయంతిని ఆత్మగౌరవ దినంగా ప్రకటించాలని తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విల్లే నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 12వ మహానాడు నిర్వహించారు.  జాక్సన్ విల్లే ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు ఆనంద్ తోటకూర ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా.. గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కోసి వేడుకలు చేసుకున్నారు.  అలాగే, శ్రీశ్రీ జయంతిని పురస్కరించుకుని మహాప్రస్థానంలో గేయాలను గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులర్పించారు. మహానాడును పురస్కరించుకుని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. 

ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. తెలుగువారికి గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన ఎన్టీఆర్ జయంతి మే 28న ప్రభుత్వపరంగా నిర్వహించాలన్నారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన ధృవతారగా వెలుగొందారన్నారు. రాజమహేంద్రవరంలో మే 27, 28,29 తేదీల్లో మహానాడు జరగనుందని.. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.  అనంతరం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే  దక్కుతుందన్నారు. 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారం చేపట్టడం ద్వారా చరిత్రలో నిలిచిపోయారన్నారు. పేద ప్రజల కోసం సంక్షేమానికి రూపకల్పన చేశారు. నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఎన్టీఆరే ఆధ్యుడన్నారు.  

దివంగత ఎన్టీఆర్ కీర్తి అజరామరమని మన్నవ సుబ్బారావు అన్నారు.  అన్న ఎన్టీఆర్ కు శతజయంతి నాడు ఆయనకు నీరాజనాలు అర్పిద్దామన్నారు. ఈ ఏడాది మే నెలలో వంద నగరాల్లో ఎన్టీఆర్ శతవసంతాల వేడుకలు ఘనంగా జరపాలని ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ అధ్యక్షులు జయరాం కోమటి పిలుపునిచ్చారని.. వాటిని అందరూ చిత్తశుద్ధితో విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు కోరారు. ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలను సమాహారం చేస్తూ సావనీర్‌ను రూపొందిస్తున్నట్టు చెప్పారు. జాక్సన్‌ విల్లే ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు ఆనంద్ తోటకూర మాట్లాడుతూ.. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర చూసి ప్రభుత్వం భయపడుతోందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో పాదయాత్ర కొనసాగిస్తున్నారన్నారు. యాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. జాక్సన్ విల్లే ఎన్ఆర్‌ఐ టీడీపీ సౌత్ ఫ్లోరిడా ప్రాంత ప్రతినిధి అనిల్ యార్లగడ్డ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కాన్వాయ్‌పై  రాళ్ల దాడి పిరికిపంద చర్య అని..  దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదన్నారు.  రాష్ట్రంలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని జాక్సన్ విల్లే ఎన్ఆర్ఐ టీడీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కోశాధికారి సుమంత్ ఈదర అన్నారు. ఇందుకోసం ప్రవాసాంధ్రులంతా తమవంతు కృషి చేయాలని సూచించారు.  ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు..ఒక శక్తి. ఆయన క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కావాలని సాయి బొల్లినేని అన్నారు.  సినీ, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ సాధించిన విజయాలు మరెవరికీ సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు, అడుసుమల్లి శ్రీనివాసరావు, సుచిత్ర యార్లగడ్డ, శ్రీలక్ష్మీ మన్నె, బాబు కొర్రపాటి, ఆనంద్ వక్కలగడ్డ తదితరులు ప్రసంగించారు. 

ఈ కార్యక్రమంలో జాక్సన్ విల్లే ఎన్ఆర్‌ఐ టీడీపీ సిటీ కౌన్సిల్ సభ్యులు గోపీకృష్ణ కుంట్ల, రాజేష్ మాదినేని, హరీష్ కుమార్ వీరవల్లి, అజయ్ చెరుకూరి, నాగేశ్వరరావు సూరే, గోపీ కడియాల, సుమన్ కాట్రగడ్డ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులతో మన్నవ సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఓర్లాండో నుంచి రవికుమార్ రావి, ఈశ్వర్ కానుమూరి, మురళీ కృష్ణ రావి పాటు పెద్దఎత్తున ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన సాంస్కృతి కార్యక్రమాల్లో చిన్నారి అదితి తోటకూర పాటలు పాడి అందరినీ అలరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు