వాషింగ్టన్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో భాను మాగులూరి అధ్యక్షతన ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.....

Updated : 27 May 2022 21:19 IST

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో భాను మాగులూరి అధ్యక్షతన ఎన్ఆర్‌ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కేక్‌ కట్‌ చేసి ఈ వేడుకల్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. తెలుగుజాతి గుండెచప్పుడు ఎన్టీఆర్ అని అన్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ, ఆయన్ను స్మరించుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. ప్రజా జీవితంలో, రాష్ట్ర రాజకీయాల్లో ప్రమాణాలు, ఉన్నత విలువల గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ముందుగా గుర్తొచ్చేది ఆ మహనీయుడి పేరేనన్నారు. భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల వ్యవస్థకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన చారిత్రక మూర్తిగా, తెలుగుదనపు తియ్యదనాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా చవి చూపించిన తెలుగు వల్లభుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

అనంతరం నూతక్కి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. రాజకీయాలను జనం మెచ్చేలా ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించిన తొలి సీఎం ఎన్టీఆర్ అన్నారు. రాజకీయాలు వృత్తి, వ్యాపారాలుగా మారిన నేపథ్యంలో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, ప్రజాసేవకు పాతరేసిన ప్రస్తుత తరుణంలో ఎన్టీఆర్ నీతి, నిజాయతీ, పట్టుదల, సాహసం ప్రతి తెలుగువాడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. రాజకీయాలలో ఉన్నది పుష్కర కాలమే అయినా ప్రజల మదిలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ఖ్యాతిని, ఛరిష్మాను ప్రపంచ దేశాలు కొనియాడాయన్నారు. జాతి నిర్మాణం వైపు ప్రజలను జాగృతం చేసి తన ఆలోచనలు, ఆవేశంతో నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారంటూ కొనియాడారు.  ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్, గోరంట్ల పున్నయ్య చౌదరి, సామినేని కోటేశ్వరరావు, ఉయ్యూరు శ్రీనివాసరావు, రామ్ చౌదరి ఉప్పులూరి, చంద్ర మల్లావతు, రమాకాంత్ కోమ, రమేష్ అవిరినేని, అనిత మన్నవ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని