PM Modi: భారత్‌లో పెట్టుబడి పెట్టండి: కీలక కంపెనీల సీఈవోలతో మోదీ భేటీ

భారత ప్రధాని మోదీ అమెరికాలోని కీలక కంపెనీల సీఈవోలతో సమావేశమై.. దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.  

Updated : 22 Jun 2023 09:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తన  అమెరికా (USA)పర్యటనలో భాగంగా అక్కడి పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ప్రముఖ చిప్‌ల తయారీ కంపెనీ మైక్రాన్‌ టెక్నాలజీ (Micron Technology ) సీఈవో సంజయ్‌ మెహ్రోత్రా, జనరల్‌ ఎలక్ట్రిక్‌( General Electric) సీఈవో లారెన్స్‌ కల్ప్‌, అప్లైడ్‌ మెటీరియల్స్‌(Applied Materials ) సీఈవో గారీ ఈ డికర్సన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు.

ప్రధానితో భేటీ తర్వాత మైక్రాన్‌ సీఈవో సంజయ్‌ మాట్లాడుతూ ‘‘భారత్‌లో అపార అవకాశాలను చూస్తున్నాం. మెమొరీ, స్టోరేజ్‌ విభాగంలో మైక్రాన్‌ గ్లోబల్‌ లీడర్‌. డేటా సెంటర్ల నుంచి స్మార్ట్‌ఫోన్లు, పీసీల వరకు మొత్తానికి మెమొరీ పరికరాలను సరఫరా చేస్తాము. నేడు కృత్రిమ మేధకు కూడా సేవలు అందిస్తున్నాం. ప్రధాని మోదీతో భేటీ అద్భుతంగా జరిగింది. భారత్‌ కోసం ఆయన దార్శనికత అద్భుతంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘దేశంలో సెమీకండక్టర్ల తయారీని పెంచేందుకు మైక్రాన్‌ టెక్నాలజీస్‌ను ప్రధాని భారత్‌కు ఆహ్వానించారు’’ అని విదేశాంగశాఖ పేర్కొంది. 

భారత వైమానిక, పునరుత్పాదక ఇంధన రంగాల్లో  జీఈ కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ కోరారు. ‘‘ప్రధాని మోదీ, సీఈవో లారెన్స్‌లు భారత్‌లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు జీఈ అందించాల్సిన సాంకేతిక సహకారంపై చర్చించారు’’ అని విదేశాంగశాఖ వెల్లడించింది.

మోదీతో సమావేశం తర్వాత అప్లైడ్‌ మెటీరియల్స్‌ సీఈవో గారీ ఈ డికర్సన్‌ మాట్లాడుతూ భారత్‌ అద్భుతమైన అభివృద్ధివైపు పయనించే సమయం ఆసన్నమైందన్నారు. ‘‘మేము ప్రధాని మోదీ, భారత్‌లోని ప్రతి ఒక్కరితో కలిసి  పనిచేసి అద్భుతమైన విజయం సాధించడానికి ఎదురు చూస్తున్నాం’’ అని అన్నారు.  ప్రాసెస్డ్‌ టెక్నాలజీ, అత్యాధునిక ప్యాకేజింగ్‌ సామర్థ్యాలను పెంచేందుకు అప్లైడ్‌ మెటీరియల్స్‌ సంస్థ భారత్‌కు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత్‌లోని విద్యాసంస్థలతో కలిసి ఆ కంపెనీ పనిచేసే అంశంపై ఇరువురు చర్చించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని