
ఆ విషయంలో భారత్ వెంటే నిలుస్తాం: పాంపియో
దిల్లీ: భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో వెంటే నిలుస్తామని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో వెల్లడించారు. దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద భారత అమర జవాన్లకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఇటీవల గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాం. భారత్ తన సార్వభౌమత్వాన్ని, స్వేచ్ఛను కాపాడుకునే ప్రయత్నాల్లో అమెరికా మద్దతుగా ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో..రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకునే లక్ష్యంతో చర్చల నిమిత్తం మైక్ పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మార్క్ టి ఎస్పర్ సోమవారం భారత్ చేరుకున్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బెకా) పై ఇరు దేశాల నేతలు సంతకాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.