
కొవిడ్ భయం.. ముందస్తుకే అమెరికా జనం
వాషింగ్టన్: మరో నాలుగు రోజుల్లో అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల రోజు కంటే ముందుగానే అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. దీన్నే ఎర్లీ ఓటింగ్(ముందస్తు ఓటింగ్)గా పిలుస్తారు. గత కొన్నేళ్లుగా అమెరికాలో ఈ ఎర్లీ ఓటింగ్ పెరుగుతుండగా.. ఈసారి కొవిడ్ కారణంగా రికార్డు స్థాయిలో ముందస్తు ఓటింగ్ నమోదైంది. ఇప్పటికే 8 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఓటేశారు.
అమెరికాలో కొవిడ్ వైరస్ మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల రోజున గుంపులు గుంపులుగా వెళ్తే కొవిడ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని భావిస్తున్న అమెరికన్లు ముందస్తు ఓటింగ్కే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే 8 కోట్ల మందికి పైగా ప్రజలు పోస్టల్ బ్యాలెట్ లేదా పోలింగ్ కేంద్రాలకు వ్యక్తిగతంగా వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2016 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లలో 50శాతానికి పైగా ఈసారి ముందస్తు ఓటింగ్లోనే నమోదవడం విశేషం.
2016 అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 13.8 కోట్ల ఓట్లు పోలయ్యాయి. అందులో 4.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్లో పాల్గొన్నారు. కాగా.. ఈ సారి ఇప్పటికే 8 కోట్ల మందికి పైగా ఎర్లీ ఓటింగ్కు వెళ్లారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా.. ఎర్లీ ఓటింగ్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్.. ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటి ఆధారంగా అధ్యక్ష ఫలితాలను అంచనా వేయలేం. 2016 ఎన్నికల్లో నమోదైన ముందస్తు ఓటింగ్లో అప్పటి డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ముందంజలో ఉండగా.. ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. ఓపీనియన్ పోల్స్లో ట్రంప్ కంటే బైడెన్ ముందంజలో ఉండటం గమనార్హం. కొవిడ్-19 నియంత్రణలో ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై ఓటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అమెరికాలో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. గత వారం నుంచి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..! నవంబరు 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.