మంగళంపల్లి.. సంగీత ప్రపంచానికి దేవుడిచ్చిన గొప్ప వరం

అమెరికాలోని కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ (సంపద) ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత సామ్రాట్, తెలుగువారు గర్వించదగిన మహోన్నతమైన వ్యక్తి మంగళంపల్లి.....

Updated : 06 Jul 2021 22:30 IST

సిలికానాంధ్ర ‘సంపద’ ఆధ్వర్యంలో ఘనంగా బాల మురళీకృష్ణ జయంతి వేడుకలు

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ (సంపద) ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత సామ్రాట్, తెలుగువారు గర్వించదగిన మహోన్నతమైన వ్యక్తి మంగళంపల్లి బాలమురళీకృష్ణ 91వ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. జులై 4న అంతర్జాల మాధ్యమాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది కళాకారులు హాజరై బాల మురళీకృష్ణతో తమకు ఉన్న అనుభవం, అనుబంధాలను పంచుకున్నారు. ప్రఖ్యాత వాయులీనం విద్వాంసులు అన్నవరపు రామస్వామి మాట్లాడుతూ..  ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ‘సంపద’ వారికి ఆలోచన రావడం చాలా గొప్ప విషయమన్నారు. డాక్టర్ బాల మురళీ కృష్ణ కారణజన్ములని, ఆయన సమకాలీకుడిగా వారితో కలిసి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద విద్య నేర్చుకోవడం తనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. బాల మురళీ కృష్ణ సంగీతంలోనే కాకుండా వయోలిన్, వయోలా, మృదంగం, కంజీర వంటి వాద్యాలలోనూ చక్కటి ప్రతిభను కనబరిచేవారన్నారు.

భగవంతుడు సంగీత ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని తాను భావిస్తానని ప్రముఖ నాట్యాచార్యులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన రచించి, స్వరపరిచిన హిందోళ తిల్లానాకు డాన్స్ చేసే అవకాశం తొలిసారిగా తనకు దక్కిందని, ఆ తర్వాత  వారి కుటుంబంతో 50 ఏళ్లకు పైగా అనుబంధ ఉందని గుర్తుచేసుకున్నారు. బాల మురళీకృష్ణ జీవించి ఉన్న సమాజంలో తాను బతకడం గొప్ప అదృష్టంగా భావిస్తానని ప్రముఖ సంగీత విద్వాంసురాలు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ సుధా రఘునాథన్ అన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ప్రోత్సహించేవారన్నారు. వారితో వేదిక పంచుకున్న సందర్భాలు తన జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి మాట్లాడుతూ..  బాల మురళీకృష్ణ తెలుగు జాతికి గర్వకారణమని, వారి జయంతి సందర్భంగా సంపద ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయనతో వేదికను పంచుకున్న ఎన్నో సందర్భాలు మరపురాని సంఘటనలుగా గుర్తుండిపోతాయన్నారు.  ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్రం నుంచి మంగళంపల్లి శిష్యులు ప్రిన్స్   రామ వర్మ,  హైదరాబాద్ నుంచి DV మోహనకృష్ణ పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. బాలమురళీ కృష్ణ రచించి, స్వరపరచిన కీర్తనలను ఆలపించి నివాళులర్పించారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బీఎం సుందరం, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్, సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం, మోదుమూడి సుధాకర్, వయోలిన్ కళాకారిణి పద్మా శంకర్, జీవీ ప్రభాకర్, మంగళంపల్లి కుటుంబ సభ్యులు అభిరామ్, డాక్టర్ మంగళంపల్లి వంశీ, కస్తూరి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ సీనియర్ శిష్యురాలు శ్వేత ప్రచండె, బాలమురళీ గారి థిల్లానాలకు తన అద్భుతమైన నాట్య ప్రదర్శనతో  వీక్షకులను అలరించింది. బాలమురళీ గారి ప్రశిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళీకృష్ణ  కీర్తనలు ఆలపించి స్వర నీరాజనాలర్పించారు. 

‘సంపద’ ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి ఆధ్వర్యంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జీవిత విశేషాలపై ఆంగ్ల, తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. దీనికి స్క్రిప్ట్, వాయిస్ ఓవర్ అందించిన డాక్టర్ మాలస్వామి (ఇంగ్లీష్), వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ (తెలుగు)కు సంపద అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేసిన ‘సంపద’ అధ్యక్షులు దీనబాబు; మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, మమత కూచిభొట్ల బాల మురళీకృష్ణ అభిమానులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని