కాన్సాస్‌లో టీఏజీకేసీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

అమెరికాలో తెలుగు అసోయేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సాస్‌ సిటీ (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో శోభకృతు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 19 Apr 2023 12:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో తెలుగు అసోయేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సాస్‌ సిటీ (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో శోభకృతు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాన్సాస్‌ నగరంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 800 మంది తెలుగువాళ్లు పాల్గొన్నారు. శ్రావణి మేక ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక హిందూ ఆలయ అర్చకులు శ్రీనివాసాచారి పంచాంగ శ్రవణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమాలకు సరిత ఆద్మ, చందన తియగూర వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే కూచిపూడి, భరతనాట్యంతో పాటు జానపద, శాస్త్రీయ నృత్యాలతో పిల్లలు, పెద్దలు అలరించారు. వీటితో పాటు ఇటీవల బాగా వైరల్‌ అయిన ‘పల్సర్‌ బైక్‌’, ‘పూనకాలు లోడింగ్‌’ పాటలకు డ్యాన్సులతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. మధ్యలో శ్రీనిధి రావు తన పాటలతో అందరినీ అలరించారు. 

నూతన కార్యవర్గ సభ్యులను టీఏజీకేసీ అధ్యక్షుడు నరేంద్ర దూదెళ్ల, కొత్త ట్రస్ట్‌ మెంబర్లను ట్రస్ట్‌ ఛైర్‌ శ్రీధర్‌ అమిరెడ్డి అందరికీ పరిచయం చేశారు. అనంతరం నరేంద్ర దూదెళ్ల మాట్లాడుతూ పిల్లలు, పెద్దలంతా ఇంట్లో తెలుగులో మాట్లాడాలని సూచించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పాటించడమే కాకుండా రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు. ఆ తర్వాత రాఫెల్స్‌లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం టీఏజీకేసీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ యక్కలి చెప్పిన ఓట్ ఆఫ్‌ థాంక్స్‌తో కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి టీఏజీకేసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం పాల్గొన్న వారందరికీ చక్కని తెలుగు భోజనం వడ్డించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని