TANA: తానా ఆధ్వర్యంలో ‘‘ తెలుగుపద్యంలో కనీవినీ ఎరుగని వృత్తాలు’’

తానా ప్రపంచసాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘ నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో తోపెళ్ల బాలసుబ్రహ్మణ్య శర్మను ‘ఛందస్సమ్రాట్‌’ బిరుదుతో సత్కరించారు.

Published : 29 May 2023 17:05 IST

టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘‘నెల నెలా తెలుగు వెలుగు’’లో భాగంగా ఆదివారం జరిగిన 48వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో “తెలుగు పద్యంలో కనీవినీ ఎరుగని వృత్తాలు” అనే సాహిత్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్య వికాసానికి క్రమం తప్పకుండా ప్రతి నెలా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగుతేజం ఎన్టీఆర్‌ శతజయంతి రోజున నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తానా సాహిత్యవేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఇది చాలా విశిష్టమైనదని సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌ అన్నారు.

తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. తోటకూర ప్రసాద్ అతిథులందర్నీ ఆహ్వానిస్తూ తెలుగు ఛందస్సులో మొత్తం 13,42,17,726 వృత్తాలు ఉన్నట్లు పరిశోధనల ద్వారా వెల్లడవుతోందని అన్నారు. కానీ, ఇప్పటివరకు తెలుగు పండితులు చెప్పిన వృత్తాలు కేవలం 437 మాత్రమే కావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సాహితీబంధు, ఛందశాస్త్ర రత్నాకర బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ పరిశోధనలో 1,863 కొత్త వృత్తాలను వెలికి తీయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు.  అంతేకాకుండా ఆయన 100 మంది పద్య కవులతో ఒక్కొక్కరు 100 వృత్తాలతో (వాడిన వృత్తాలు వాడకుండా) మొత్తం 10,000 పద్యాలను రాయించి, ఆ పద్యాలను ‘అనంతచ్చంద సౌరభము’’అనే గ్రంథ రూపంలో గత ఏడాది అక్టోబరులో ప్రచురించినట్లు గుర్తు చేశారు. ఈనాటి తానా ప్రపంచసాహిత్యవేదికలో 50 మంది పద్యకవులు పాల్గొంటూ కొత్త వృత్తాలతో తాము రాసిన 150కి పైగా పద్యాలను గానం చేయడం ఒక ప్రత్యేకత అన్నారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న సహస్రావధాని డా. కడిమిళ్ల వరప్రసాద్ మాట్లాడుతూ.. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ చేసిన సాహిత్య కృషి మాటలకందనిదని అన్నారు. ఎన్ని విశ్వవిద్యాలయాలు, ఎన్ని గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసినా అవి సరితూగవని ప్రశంసించారు. తోపెల్ల శర్మ శిక్షణలో తాను కూడా పద్యరచన చేయడం ఒక మధురమైన అనుభూతి అని గౌరవ అతిథిగా పాల్గొన్న ఐఐటి ముంబయి విశ్రాంత ఆచార్యులు డా. గోసుకొండ సుబ్రహ్మణ్యం అన్నారు. 50 మంది పద్యకవులు విశిష్ట అతిథులుగా పాల్గొని తాము రాసిన కొత్త వృత్తములలోని పద్యాలను శ్రావ్యంగా ఆలపించి సాహితీ ప్రియులందరినీ అలరించారు. ఈ సందర్భంగా తోపెళ్ల బాలసుబ్రహ్మణ్య శర్మకు ‘‘ ఛందస్సమ్రాట్‌’’ బిరుదుతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు