కువైట్‌లో తెలుగువారి సంక్షేమాన్ని వైకాపా సర్కార్‌ గాలికొదిలేసింది: పట్టాభి

కువైట్‌లో నివసిస్తున్న సుమారు 4లక్షల మంది ప్రవాస తెలుగు పౌరుల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసిందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌.....

Published : 04 Jun 2022 20:07 IST

కువైట్‌లో ఘనంగా మహానాడు వేడుకలు

కువైట్: కువైట్‌లో నివసిస్తున్న సుమారు 4లక్షల మంది ప్రవాస తెలుగు పౌరుల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసిందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్  ఆదేశాల మేరకు తెదేపా కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు నేతృత్వంలో జరిగిన మహానాడు, ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ.. 2024లో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు పార్టీ కేడర్‌ని ఇబ్బందులకు గురిచేస్తున్న వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పని ప్రారంభిస్తామని, చంద్రబాబు ప్రమాణ స్వీకారం వరకు ఆగబోమని చెప్పారు. ఏపీకి చెందిన సుమారు 4లక్షల మంది వివిధ వృత్తుల వారు కువైట్‌లోని వివిధ ప్రాంతాల్లో డ్రైవర్లు, హౌస్ మెయిడ్స్, హౌస్ కీపర్స్ తదితర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారనీ..  రాయలసీమ నుంచి వెళ్లిన వారు అత్యధిక సంఖ్యలో కువైట్‌ వెళ్లి బతుకుబండి లాగుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏఆర్‌టీ విభాగం ఏర్పాటు చేసి ప్రవాస తెలుగుపౌరులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేవారని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక గత మూడేళ్లలో కువైట్‌లోని ప్రవాస తెలుగు ప్రజల సంక్షేమాన్ని, వారి సమస్యలను గాలికొదిలేసిందని పట్టాభి ఆరోపించారు.

అనంతరం తెదేపా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ మాట్లాడుతూ.. అధికారంలో లేకపోయినప్పటికీ తెలుగుదేశం కువైట్ విభాగం ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసులకు ఇతోధికంగా సాయం చేస్తూ భరోసా కల్పిస్తోందన్నారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందని, కువైట్‌లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి కృషిచేస్తుందని తెలిపారు. జగన్ మోసపూరిత పథకాలు,  వైఫల్యాలను వివరించిన కువైట్ తెదేపా నేత  ఈశ్వర్ నాయుడు.. త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.

శుక్రవారం సాయంత్రం ఖైతాన్ ప్రాంతంలో ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన మహానాడుకు పలు ప్రాంతాల నుంచి భారీగా తెదేపా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించి, భారీ కేక్ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మహానాడులో పలు తీర్మానాలు ఆమోదించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ బలోపేతానికి తమవంతు సహకారం అందించాలని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కువైట్‌లో పెద్దఎత్తున చేపట్టాలని తీర్మానించారు. వైకాపా గూండాల చేతిలో హతమైన కంచర్ల జల్లయ్యకు ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు.  ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కువైట్ సీనియర్ నాయకులు షేక్ బాషా, బోయపాటి శ్రీనివాసులు, దుగ్గి శ్రీనివాసులు, వీసీ సుబ్బారెడ్డి, దుర్గాప్రసాద్, షేక్ చాన్ బాషా, పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని