ఆసక్తిగా ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం 177వ సాహితీ సదస్సు

ఉత్తర టెక్సాస్‌ సంఘం ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 10న జరిగిన ‘177వ నెల నెలా తెలుగు వెన్నెల’ కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.

Updated : 15 Apr 2022 00:09 IST

టెక్సాస్‌: ఉత్తర టెక్సాస్‌ సంఘం ఆధ్వర్యంలో ‘నెలనెలా తెలుగు వెన్నెల’ ధారావాహికలో భాగంగా ఈ నెల 10న జరిగిన ‘177వ నెల నెలా తెలుగు వెన్నెల’ కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. కొవిడ్ కారణంగా గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం అంతర్జాల వేదికగా నిర్వహిస్తూ వచ్చారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి నేరుగా, అంతర్జాలంలో రెండింటా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన నేరుగా సభకు వచ్చిన వారు, అంతర్జాలం ద్వారా పాల్గొన్నవారినుద్దేశించి మాట్లాడారు. అంతర్జాలం ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో గోవర్థనరావు నిడిగంటి, రాధ కాశీనాథుని, శారద సింగిరెడ్డి, లక్ష్మి పాలేటి, నెల్లూరులోని దొడ్ల కౌశల్యమ్మ మహిళా కళాశాల తెలుగు అధ్యాపకులు  కోటేశ్వరరావు పుట్టమరాజు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీరామనవమిని పురస్కరించుకొని చిన్నారులు సింధు, సాహితీ భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా  సత్యం ఉపద్రష్ట, రాధ కాశీనాథుని కలిసి పద్య సౌగంధం శీర్షిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల రాధ, నంది తిమ్మన పారిజాతాపహరణంలోని పద్యాలను పాడి వినిపించారు. కవి సమ్మేళనంలో భాగంగా లెనిన్ వేముల భాస్కర రామాయణం నుంచి మనసును రంజింపజేసే కొన్ని కీర్తనలు పాడి అందరినీ అలరించారు. ఆధునిక సహజ పండితులు డా.నరసింహారెడ్డి ఊరుమిండి గత నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ‘మన తెలుగు సిరిసంపదలు’ కార్యక్రమంలో పొడుపుకథల మిళితమైన పద్యాలు, చమత్కార పదాలు ఉండే శ్లోకాలు, పదభ్రమకాలు సోదాహరణంగా వివరిస్తూ సభికులకి ప్రశ్నలు సంధించారు. ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం పాలక మండలి సభ్యులు అనంత్ మల్లవరపు ప్రముఖ కవి గుజ్రాల్ ఉర్దూ కవిత్వాన్ని కవి సమ్మేళనంలో భాగంగా చదివి వినిపించారు. 2010 నుంచి జరుగుతున్న ‘మాసానికో మహనీయుడు’ శీర్షిక కింద ఏప్రిల్ నెలలో గుర్తు చేసుకోదగిన కవులు, రచయితలను ఉద్దేశించి అరుణ జ్యోతి.. ఆనాటి సంఘ దురాచారాలను ఎత్తి చూపిన కవి కందుకూరి వీరేశలింగం రాసిన ‘రాజశేఖర చరిత్రం’ నవల గురించి సవివరంగా వివరించారు. యుద్ధం గురించి ప్రముఖ కవి వరవరరావు రాసిన కవితలను సాజీ గోపాల్ సభకు చదివి వినిపించారు.   

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా.బీరం సుందరరావు ‘మానవత్వం పరిమళించే తెలుగు కవిత్వం’ అంశం మీద ప్రసంగించారు. మానవ సేవయే మాధవ సేవయని చాటి చెప్పిన కవులు, వారు రాసిన కొన్ని ముఖ్యమైన పద్యాలు, కవితలు చదివి వినిపించారు. మనకు తారసపడే ప్రతి వ్యక్తిలోనూ దైవం ఉన్నాడని భావించి, వారికి అవసర సమయంలో సహాయపడాలన్నారు. తృప్తితో జీవించగలిగితే అదే స్వర్గమని, మనం మన చుట్టూ ఉన్నవారిపై ప్రేమ, దయ చూపించి మానవత్వాన్ని పరమళింప చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. 

ఈ సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి ముఖ్య అతిథిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ప్రార్థనా గీతం పాడిన సాహితీ, సింధూతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మాధవి లోకిరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఉదయ్ నిడిగింటి, వైస్ ప్రెసిడెంట్ సతీష్ బండారు, పాలక మండలి నుంచి వెంకట్ ములుకుట్ల, అనంత్ మల్లవరపు, డా.భాస్కర్ రెడ్డి తదితరులు విచ్చేసి సభను జయప్రదం చేసారు. 

శ్రీరామనవమి సందర్భంగా ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం పూర్వాధ్యక్షులు లక్ష్మి పాలేటి సభ్యుల కోసం వడపప్పు, పానకం స్వయంగా చేసి తీసుకువచ్చారు. ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మాధవి లోకిరెడ్డి భద్రాచలం నుంచి సీతారాముల కల్యాణం లడ్డుని సభకు విచ్చేసిన వారికి పంచారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని