Australia: మెల్‌బోర్న్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం.. అవమానకరమన్న ఆస్ట్రేలియా ప్రధాని!

మెల్‌బోర్న్‌లో గాంధీ విగ్రహాన్ని అక్కడి ప్రధానమంత్రి ఆవిష్కరించి రెండు రోజులు గడువక ముందే కొందరు దుండగులు మహాత్ముడి విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.

Published : 15 Nov 2021 17:38 IST

ఇటువంటి దాడులను సహించబోమని స్పష్టం

మెల్‌బోర్న్‌: అహింసా మార్గాన్ని అనుసరించి యావత్‌ ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన మహాత్మా గాంధీ స్మారక చిహ్నాలు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈమధ్యే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోనూ గాంధీ విగ్రహాన్ని అక్కడి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అయితే, గాంధీ విగ్రహాం ఏర్పాటు చేసి రెండు రోజులు గడువక ముందే కొందరు దుండగులు మహాత్ముని విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనను ఖండించిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌.. ఇది చాలా అవమానకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సహాయంతో మెల్‌బోర్న్‌ శివారు ప్రాంతమైన రోవిల్లేలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌, కౌన్సిల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాతో సహా పలువురు ప్రముఖులు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటలకే మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో గాంధీ విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది.

ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ తీవ్రంగా ఖండించారు. ఇది తీవ్ర అవమానకరమన్న ఆయన.. ఇలాంటి అగౌరవపరిచే చర్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయని పేర్కొన్నారు. వివిధ దేశాల సంస్కృతులకు నెలవైన ఆస్ట్రేలియాలో ఇటువంటి స్మారక చిహ్నాలపై దాడులను సహించబోమని స్పష్టం చేశారు. అయితే, మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించేందుకు విక్టోరియా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అక్కడి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు