Liquor Bottle Missing: ఆ మద్యం బాటిల్‌ ఎక్కడ..? అమెరికా దర్యాప్తు

అమెరికా విదేశాంగమంత్రిగా ఉన్న మైక్‌ పాంపియోకు జపాన్‌ అధికారులు ఓ ఖరీదైన మద్యం బాటిల్‌ బహుమతి ఇచ్చారు. తాజాగా ఆ విస్కీ బాటిల్‌ మాయం కావడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. దీనిపై ఏకంగా అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

Updated : 05 Aug 2021 22:19 IST

దాదాపు రూ.4లక్షల విలువైన మద్యం బాటిల్‌ను అమెరికాకు గిఫ్ట్‌గా ఇచ్చిన జపాన్‌

వాషింగ్టన్‌: విదేశీ పర్యటనల్లో భాగంగా ఏదైనా దేశానికి వెళ్లిన మంత్రులు, ఉన్నతాధికారులకు అక్కడి అధికారులు కొన్నిరకాల బహుమతులు ఇస్తుంటారు. కొన్ని పరిమితులకు లోబడి ఇలాంటివి స్వీకరించేందుకు ప్రభుత్వాలు కూడా అనుమతిస్తాయి. ఇందులో భాగంగా ట్రంప్‌ హయాంలో అమెరికా విదేశాంగమంత్రిగా ఉన్న మైక్‌ పాంపియోకు జపాన్‌ అధికారులు ఓ ఖరీదైన మద్యం బాటిల్‌ బహుమతి ఇచ్చారు. తాజాగా ఆ బాటిల్‌ మాయం కావడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. దీనిపై ఏకంగా అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్న సమయంలో విదేశీ పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో 2019, జూన్‌ 24న జపాన్‌లో పర్యటించారు. ఈ సమయంలో అక్కడి ప్రభుత్వ అధికారులు ఆయనకు 5800 డాలర్ల విలువచేసే ఓ మద్యం బాటిల్‌ ను బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో మైక్‌ పాంపియో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నట్లు అమెరికా వార్తా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. జపాన్‌ అధికారులు మద్యం బాటిల్‌ బహుమతిగా ఇచ్చినట్లు తేలినప్పటికీ మైక్‌ పాంపియో నేరుగా తీసుకున్నారా? లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఆ బాటిల్‌ మాయం అయినట్లు తేలడం చర్చకు దారితీసింది. దీంతో అమెరికా ప్రభుత్వం ఈ మద్యం సీసా మాయంపై దర్యాప్తునకు ఆదేశించింది. 

సాధారణంగా 390 డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన బహుమతులను అమెరికా ప్రభుత్వ అధికారులు అనుమతిస్తారు. అంతకుమించిన వస్తువు బహుమతిగా తీసుకోవాల్సి వస్తే వాటి అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అప్పటి అమెరికా ప్రభుత్వం మాత్రం ఆ మద్యం బాటిల్‌కు అలా చెల్లించినట్లు ఎక్కడా వెల్లడికాలేదు. అంతేకాకుండా మద్యం సీసా కూడా కనిపించకుండా పోయేసరికి అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, ఇలాంటి వస్తువుల ఆచూకీ లభ్యం కావడం లేదనే విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ బహిరంగపరచడం అసాధారణ విషయమని న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. దీనిపై స్పందించిన మైక్‌ పాంపియో న్యాయవాది, మిస్సింగ్ బాటిల్‌ ఎక్కడుందో తనకు కూడా తెలియదని చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని