Travel Curbs: భారత్‌ సహా పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

అగ్రదేశం అమెరికా భారత్‌ సహ పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అవి నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడంతో అమెరికా మొదటిసారి విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. 

Updated : 26 Oct 2021 12:43 IST

నవంబర్ 8 నుంచి అమల్లోకి..

వాషింగ్టన్‌: భారత్‌ సహా పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ అగ్రదేశం అమెరికా ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. తాజా నిర్ణయం నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడంతో అమెరికా మొదటిసారి విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. 

‘అమెరికా ప్రయోజనాల దృష్ట్యా కొవిడ్ సమయంలో విధించిన ఆంక్షల్ని తొలగిస్తున్నాం. టీకా ఆధారిత అంతర్జాతీయ విమాన ప్రయాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని అని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ నుంచి ఇచ్చినటువంటి మినహాయింపునే 18 ఏళ్ల లోపు పిల్లలకూ ఇచ్చింది. వ్యాక్సినేషన్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. వారు అమెరికాకు వచ్చిన 60 రోజుల్లోపు టీకా పొందాల్సి ఉందని చెప్పింది. ప్రయాణం ప్రారంభమైన 72 గంటల్లోపు చేయించుకొన్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్‌ రిపోర్టును అందించాలి.  

పలు దేశాలపై పరిమితుల తొలగింపు గురించి సెప్టెంబర్‌లోనే శ్వేతసౌధం ప్రకటించింది. అలాగే విదేశీ ప్రయాణికుల పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌ గురించి విమానయాన సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలను వెలువరించింది. పరిమితులు ఎత్తివేసిన వేళ.. సీడీసీ కాంటాక్ట్ ట్రేసింగ్ సంబంధించి విమానయాన సంస్థలకు నిబంధనలు జారీచేసింది. ప్రయాణికుల నుంచి తగిన సమాచారం సేకరించాలని స్పష్టం చేసింది. అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన టీకా తీసుకున్న వారు తమ దేశంలో ప్రయాణించేలా సీడీసీ గతంలోనే మార్గదర్శకాలు విడుదల చేసింది. మిక్స్‌డ్‌ డోసులు విషయంలో కూడా వెసులుబాటు కల్పించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని