వేడుకగా తెలుగు పీపుల్ ఫౌండేష‌న్ వార్షికోత్సవం

పేద విద్యార్థుల కలలను సాకారం చేసి సమాజ అభ్యున్నతికి తోడ్పాటును అందించడమే తమ లక్ష్యసాధన అని తెలుగు పీపుల్ ఫౌండేష‌న్ ఆర్గనైజేషన్‌ నిరూపిస్తోంది. ప్రవాసుల నుంచి విరాళాలు సేకరించి భార‌త్‌లోని పేద విద్యార్థుల చ‌దువు కోసం ఈ సంస్థ ఆర్థిక సాయం చేస్తోంది.

Updated : 05 Dec 2022 10:19 IST

న్యూజెర్సీ: పేద విద్యార్థుల కలలను సాకారం చేసి సమాజ అభ్యున్నతికి తోడ్పాటును అందించడమే తమ లక్ష్యసాధన అని తెలుగు పీపుల్ ఫౌండేష‌న్ ఆర్గనైజేషన్‌ నిరూపిస్తోంది. ప్రవాసుల నుంచి విరాళాలు సేకరించి భార‌త్‌లోని పేద విద్యార్థుల చ‌దువు కోసం ఈ సంస్థ ఆర్థిక సాయం చేస్తోంది. న్యూజెర్సీ ఎడిసన్‌లోని జేపీ స్టీవెన్స్ హైస్కూల్‌లో ఈ సంస్థ  14వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ సంస్థ నిర్వాహకులు 107,000 డాలర్లకు పైగా పలువురి నుంచి విరాళాలు సేకరించారు. ఈ విరాళాల‌ను పేద విద్యార్థుల చ‌దువుకోసం వినియోగించ‌నున్నట్లు తెలిపారు. 

తెలుగు పీపుల్ ఫౌండేష‌న్ ఇప్పటికే 325 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించింది. 53 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. గ‌డిచిన‌ 14 ఏళ్లలో భారత్‌లోని పేద విద్యార్థులకు రూ.3 కోట్లకుపైగా పంపిణీ చేసింది. వంద‌లాది మంది పేద‌ విద్యార్థుల చ‌దువుకోసం తాము చేయుత అందించామ‌ని, మున్ముందు కూడా అందిస్తామ‌ని తెలుగు పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కొత్త తెలిపారు. త‌ల‌దించుకొని చ‌దువుకొండి.. స‌మాజంలో రేప‌టి రోజున త‌లెత్తుకుని జీవించండి అంటూ ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ విద్యార్థులకు హిత‌బోధ చేశారు. తాము విద్యార్థుల‌ కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామ‌ని కృష్ణ కొత్త తెలిపారు. త‌మ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్, సీఏ వంటి ఉన్నత విద్యకు సహాయం చేస్తున్నామన్నారు. తాము ఇప్పటివరకు స్పాన్సర్ చేసిన 325 మంది విద్యార్థులలో 125 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారు ఉన్నట్లు తెలిపారు. 26 మంది ఐఐటీ, సెంట్రల్ యూనివర్శిటీలు, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతున్నార‌ని తెలిపారు. 24 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ (మెడిసిన్) చదువుతున్నార‌ని, పది మంది విద్యార్థులు ఛార్టర్డ్ అకౌంటెన్సీ, ఒక విద్యార్థి సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్నారని చెప్పారు. తాము ఆర్థికంగా, నైతికంగా ఇచ్చే మ‌ద్దతుతో విద్యార్థులు తమ చదువులో ల‌క్ష్యాలు సాధిస్తున్నార‌ని కృష్ణ వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంసీ రమ్య అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, గాయకులు, కళాకారుల బృందంతో ప్రత్యక్ష సంగీత వినోద కార్యక్రమాన్ని అందించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్ తన ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తూ, అద్భుతమైన సేవ చేస్తున్న సంస్థను అభినందించారు. కొరియోగ్రాఫర్లు ప్రజ్ఞ, రిహే ప్రేక్షకులను అలరించారు. ఈ ఆర్గనైజేషన్‌ ద్వారా ప్రతి ఏడాది ఎంతో మంది పేద విద్యార్థుల‌కు చ‌దువుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని తెలుగు పీపుల్ ఫౌండేష‌న్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు ప్రసాద్‌ కూనిశెట్టి, క‌న్వీన‌ర్ అర‌వింద బోయ‌పాటి, ఫండ్ రైసింగ్, ఫైనాన్స్ డైరెక్టర్‌ ప్రవీణ్‌ గూడురు, సీత కొడవటిగంటి, లక్ష్మి మోపర్తి, ఇందిరా శ్రీరామ్ దీక్షిత్, ప్రసాద్ సింహాద్రి, శృతి నండూరి, అరవింద్, శ్రీషా గోరస, నిఖిల్ అయ్యర్, ప్రణవ్, శ్రీధర్ వైద్యనాథ, కార్తీక్ రామసుబ్రమణియన్, 40 మంది స్పాన్సర్‌లు, వంద మంది వాలంటీర్లు సహా దాదాపు 800 మంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని