
Trump: వైరస్ గురించి నేను ముందే చెప్పానా..!
వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందంటున్నారు అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాలోని వుహాన్ ల్యాబ్లోనే ఈ వైరస్ను సృష్టించారంటూ ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ పరిశోధనలపై స్పందించిన ట్రంప్.. తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంతటి విధ్వంసం సృష్టించినందుకు గానూ చైనా.. యావత్ ప్రపంచానికి భారీ మూల్యం చెల్లించాలని అన్నారు.
‘‘చైనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పింది కరెక్టేనని ఇప్పుడు ‘శత్రువుల’తో సహా ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇన్ని మరణాలు, ఇంత విధ్వంసానికి కారణమైన చైనా.. అమెరికా, ప్రపంచానికి 10 ట్రిలియన్ డాలర్లు చెల్లించాలి’’ - డొనాల్డ్ ట్రంప్
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి ఏడాది గడిచినా ఇంకా దాని పుట్టుపూర్వోత్తరాలపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ వైరస్ను చైనానే సృష్టించిందని, ఇది కుంగ్ ఫూ వైరస్ అని ట్రంప్ గతేడాదే ప్రకటించారు. అయితే ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవని శాస్త్రవేత్తలతో పాటు అమెరికా గూఢఛారి సంస్థలూ పేర్కొన్నాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలల్లో ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఈ విషయం తాత్కాలికంగా మరుగున పడినా.. ఇటీవల మళ్లీ చైనా కుట్రకోణం తెరపైకి వచ్చింది. ఈ వైరస్ చైనా సృష్టే అని, జీవాయుధంగా మార్చేందుకు డ్రాగన్ చేసిన పరిశోధనల ఫలితమే మహమ్మారి విలయమని ఇటీవల బ్రిటన్ సహా పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
మరోవైపు కరోనాను జీవాయుధంగా మార్చేందుకు చైనాకు అమెరికా ఆర్థిక సాయం చేస్తుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే కొవిడ్ కారక వైరస్కు తెలిసో తెలియకో చైనా, అమెరికాలు రెండూ పురుడు పోశాయనే అనుమానం బలపడుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.