ఉగాది వేళ సింగపూర్‌లో కన్నుల పండువగా శ్రీవారి కల్యాణోత్సవం

సింగపూర్‌లో ఉగాది పర్వదినం పురస్కరించుకొని శ్రీవారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చి ఈ మహోత్సవాన్ని తిలకించారు.

Published : 24 Mar 2023 18:47 IST

సింగపూర్‌: ఉగాది వేడుకలను సింగపూర్ తెలుగు సమాజం ఘనంగా నిర్వహించింది. లోక కల్యాణార్థం, వచ్చే ఏడాది అందరికీ మంచి జరగాలనే మహా సంకల్పంతో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన శ్రీదేవి, భూదేవి సమేత కలియుగ వైకుంఠ నాథుడైన శ్రీనివాసుడికి విశేష పూజలు ఆచరించారు. సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకంతో పాటు విష్ణుదుర్గ అమ్మవారికి  అభిషేకం, విశేష కైంకర్యములతో శ్రీవారి కళ్యాణోత్సవాన్నిఅంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక సెరంగూన్ రోడ్‌లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో మార్చి 22న అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకను వీక్షించేందుకు భారీగా భక్తజనం తరలివచ్చారు. గోవింద నామస్మరణలతో ఆ ప్రాంగణం మార్మోగింది. సింగపూర్‌లో కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా సడలించిన తర్వాత నిర్వహించిన తొలి ఉగాది ఇదే కావటంతో సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారాంతం కాకపోయినా  భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించిన తెలుగు సమాజానికి భక్తులంతా కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం బ్రహ్మోత్సవాల చివరి రోజు ఈసారి ఉగాదిన రావటం విశేషం కాగా, ఏడాదిలో కేవలం 4సార్లు మాత్రమే అరుదుగా దేవాలయం వెలుపలకు వచ్చే ఉత్సవ మూర్తులకు తెలుగువారు ఉగాదిన అనేక సేవలు చేయడం మరో విశేషం.

కళ్యాణోత్సవం అనంతరం శ్రీవారు ఆస్థానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని అందరూ ఆసక్తిగా ఆలకించారు. అంతేకాకుండా ఈ ఏడాది ఉదయం కూడా సుమారు గంటసేపు పంచాంగ శ్రవణాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు వారందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి  దేవస్థానం కార్యవర్గ సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహాయ సహకారాలతో తీసుకొచ్చిన తిరుపతి లడ్డూ, వడ, మంగళ ద్రవ్యాలను, ప్రసాదంగా అందజేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా సుమారు 3,000 మందికి పైగా వీక్షించారన్నారు. అలాగే,  ఉగాది రోజున దాదాపు 2,000 మందికి సింగపూర్‌లోనే అరుదుగా లభించే వేప పువ్వు అందించామని, సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని 6,000 మందికి పైగా పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ అన్న ప్రసాదాన్ని అందించినట్టు కార్యక్రమ నిర్వాహకులు బచ్చు ప్రసాద్ తెలిపారు. తమ కుటుంబాలకు దూరంగా సింగపూర్‌లో నివసిస్తున్న కార్మిక సోదరులందరికీ ఉగాది పచ్చడిని అందించామన్నారు. స్థానికుల సైతం ఈ ఉగాది పచ్చడిని సేవించి దాని విశిష్టతను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించిన పెరుమాళ్‌ దేవస్థానం కార్యవర్గం, దాతలు, కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులు, భక్తజనం, పంచాంగ శ్రవణం చేసిన పండితులకు, వాలంటీర్లందరికీ సింగపూర్‌ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు