బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు.. బీటీఏ నూతన కార్యవర్గం పరిచయం!

అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో ఉగాది వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఆబాలగోపాలం సంప్రదాయ వస్త్రధారణతో సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు.

Updated : 18 Apr 2023 19:39 IST

బోఇసీ: అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో తెలుగు వారు ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు.  బోఇసి తెలుగు సంఘం(BTA) ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 8న నిర్వహించిన శోభకృత్‌ నామ ఉగాది వేడుకలకు దాదాపు 400మందికి పైగా తెలుగు ప్రజలు తరలివచ్చి సందడి చేశారు. కరోనా తర్వాత బోఇసీలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిదంగా చిన్నారులు, పెద్దలంతా సంప్రదాయ వస్త్రధారణతో, వినూత్న కార్యక్రమాలతో అందరినీ అలరించారు.  ‘తెలుగు బడి’ పిల్లల పద్యాలు, చక్కటి అన్నమయ్య కీర్తనలు, టాలీవుడ్‌ పాటలకు నృత్యాలు, తెలుగుతనం ఉట్టిపడే నృత్యమాలిక, మాస్‌ డ్యాన్స్‌లు, సెమీ క్లాసికల్‌ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఈ ఏడాది విశేషంగా కొన్ని పాటలకు పిల్లలే కొరియోగ్రఫీ చేసి అందరూ గర్వపడేలా చేశారు. ఆస్కార్‌ సొంతం చేసుకున్న తెలుగుపాట నాటు నాటుకు డ్యాన్స్‌తో హాలు దద్దరిల్లింది. అనంతరం తెలుగు వంటకాలను ఆరగించి అంతా సంతోషంగా గడిపారు.

ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతం కావడానికి కృషిచేసిన అందరినీ నిర్వాహకులు జ్ఞాపికలతో సత్కరించారు. అలాగే, క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సభాలో బోఇసీ తెలుగు సంఘం లక్ష్యాలను ఉపాధ్యక్షుడు అనిల్ కుక్కుట్ల వివరించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, గొప్పతనాన్ని గుర్తుకు తెచ్చుకుని, మన పిల్లలతో పంచుకోవడమే ముఖ్య ఉద్దేశమన్నారు.  అలాగే ఈ ఏడాది ఎంతో కృషి చేసిన అధ్యక్షులు రమ్య తాతపూడి, కార్యదర్శి శివ నాగిరెడ్డి ఉయ్యూరు, కోశాధికారి సందీప్ తెల్లమల శెట్టి కొలను, నిర్వాహకులు హరీష్ వీరవల్లికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన పరిచయ కార్యక్రమంలో వ్యవస్థాపకులు హరి విన్నమాల, సింహాచలం పిల్ల.. ఈ ఏడాది నూతన అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ కుక్కుట్ల, ఉపాధ్యక్షురాలు సింధు మెట్పల్లి, కార్యదర్శి  శివ నాగిరెడ్డి ఉయ్యూరు, కోశాధికారి రామ్యా గంటి, మీడియా కార్యదర్శి భార్గవి బండర్ల, సాంస్కృతిక నిర్వాహకులు మైత్రి రెడ్డి, ఈవెంట్ నిర్వాహకులు శశాంక్ వేమూరిలని పరిచయం చేశారు. బోఇసీ తెలుగు సంఘం సభ్యులు సభా వేదికపైకి వచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది ఉగాది వేడుకలను మరింత వైభవంగా, మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని