సింగపూర్‌లో వైభవంగా వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు

వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని ఆర్యవైశ్యులు శ్రీ వాసవి మాత జయంతిని ఘనంగా నిర్వహించారు.

Published : 05 May 2023 20:38 IST

సింగపూర్‌: వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని ఆర్యవైశ్యులు శ్రీ వాసవి మాత జయంతిని ఘనంగా నిర్వహించారు.  చైనా టౌన్‌లోని  శ్రీ మారియమ్మన్ ఆలయంలో ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకొన్నారు.  వాసవి జయంతితో పాటు VCMS పదో వార్షికోత్సవ సంబరాలను సైతం ఇదే సమయంలో జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకల్లో దాదాపు 350మందికి పైగా ఆర్యవైశ్యులు పాల్గొని తమ భక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఎప్పటిలాగే వాసవి అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ, రథయాత్ర తదితర ఆధ్యాత్మిక సేవలో పాల్గొని తెలుగు సంప్రదాయ భోజన, తీర్థప్రసాదాస్వీకరించి తరించారు. ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన అనేకమంది ఔత్సాహిక కళాకారులు తమ కళా ప్రతిభతో ఈ కార్యక్రమానికి మరింత వన్నె తీసుకొచ్చారు. 

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ మరియప్పన్‌ ఆలయం వైస్‌ ఛైర్మన్‌  బొబ్బ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.  VCMS కార్యనిర్వాహక బృందానికి చెందిన నాగరాజు కైల, నరేంద్ర కుమార్ నారంశెట్టి,  సరిత విశ్వనాథన్, ముక్క కిషోర్‌ వేదికపై ఆసీనులయ్యారు.  ఈ సందర్భంగా నాగరాజ్ కైల, శ్రీధర్  మంచికంటి మాట్లాడుతూ.. అతి కొద్దిమంది ఆర్యవైశ్యులతో చిన్న సంస్థగా  ప్రస్థానాన్ని ప్రారంభించిన  VCMS.. ఈ పదేళ్లలో ఒక వటవృక్షంగా ఎదగడం గొప్ప విషయమన్నారు. దీని వెనుక ఎంతోమంది సింగపూర్‌ ఆర్యవైశ్యుల అంకితభావం, కృషి ఉన్నాయన్నారు.  అనంతరం సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు రంగా రవిని సత్కరించి గౌరవించారు. 

‘గణానాం త్వ గణపతిం’ అంటూ చిన్నారి కారె సాయి కౌశాల్ గుప్త చేసిన రుగ్వేదంలోని గణపతి ప్రార్థనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. శిల్పా రాజేష్ సారథ్యంలో కోలాట నృత్య ప్రదర్శన బృందం వేదికపై వాసవి మాతకు కోలాటంతో వందనాలు సమర్పించింది. సింగపూర్‌లో తొలిసారి  శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను దృశ్య శ్రవణ మాధ్యమాల సహాయంతో నాటక రూపంలో ప్రదర్శించారు. వాసవి మాత నాటక రూపానికి మూల ప్రతిపాదనను చైతన్య రాజా బాలసుబ్రహ్మణ్యం చేయగా, కథ కూర్పు,  సంభాషణలు ఫణేష్ ఆత్మూరి వెంకట రామ సమకూర్చారు.  కిషోర్ కుమార్ శెట్టి దర్శకత్వం వహించారు. అంతేగాక  యువ కళాకారులు కుమారి అక్షర శెట్టి మాడిచెట్టి, చిరంజీవి ముక్తిధ, చిరంజీవి  ఉమా మోనిష నంబూరిల భరతనాట్య ప్రదర్శనలు, చిన్నారి తన్వి మాదారపు  ప్రదర్శించిన కూచిపూడి నృత్యం తదితర  సాంప్రదాయ నృత్య కళారీతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆనంద్ గంధే, కిరణ్ కుమార్ అప్పన,  చిరంజీవి కొండేటి,  ఈశాన్ కృష్ణ  తమ గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు. సాయంత్రం అమ్మవారికి జరిపిన కుంకుమార్చన అలంకార పూజ అనంతరం రథయాత్ర నిర్వహించారు. గాదంశెట్టి నాగ సింధు నేతృత్వంలో 16 మంది మహిళలు చేసిన కోలాటం ప్రదర్శన అందరినీ అలరించింది.

అలాగే, VCMS నూతన కార్యవర్గ బృంద సభ్యులను సైతం ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రకటించారు. వీసీఎంఎస్‌ అధ్యక్షుడిగా మురళీకృష్ణ పబ్బతి, సెక్రటరీగా సుమన్ రాయల,  కోశాధికారిగా ఆనంద్ గంధే, మహిళా విభాగానికి సారథిగా సరిత విశ్వనాథన్‌లను ఆహూతులకు పరిచయం చేశారు.  అనంతరం ఈ సంస్థ చేసిన కృషిని గుర్తిస్తూ నరేంద్ర కుమార్ నారంశెట్టిని ‘వాసవి సేవా కుసుమ’గా అభినందిస్తూ చిరు సత్కారంతో పాటు జ్ఞాపికను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. సింగపూర్‌లో పదేళ్లుగా VCMS వైశ్య ధర్మాన్ని నిలబెడుతూ అనేక సాంస్కృతిక, సాంఘిక కార్యకలాపాలకు వారధిగా ఎనలేని సేవలు చేస్తోందన్నారు. ఇక్కడ పెరుగుతోన్న ఆర్యవైశ్య భావితరానికి వీసీఎంఎస్‌ ఓ దీపస్తంభంగా వెలుగొందుతోందని చెప్పారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంధానకర్తగా ఆత్మూరి వెంకట రామ ఫణేష్,  సహ వ్యాఖ్యాతగా వాసవి  ఫణేష్ ఆత్మూరి తమ తెలుగునుడితో వ్యవహరించటం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ నూతన ప్రెసిడెంట్ మురళీకృష్ణ పబ్బతి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని