వెంకయ్యనాయుడుతో ప్రవాస సంఘాల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం

అమెరికా రాజధాని వాషింగ్టన్ వేదికగా 28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 13 Jul 2023 14:54 IST

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్ వేదికగా 28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం వారి సహకారంతో  వందలాది మంది భారతీయుల సమక్షంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో వెంకయ్య నాయుడు తన అమూల్యమైన సందేశం అందించారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం పరిపూర్ణ నిర్వచనమన్నారు. ఎన్నోదశాబ్దాల నుంచి ప్రజాస్వామ్యయుతంగా అంతా కలిసి మెలిసి ఐక్యతతో, ప్రగతిశీల దేశాభ్యుదయానికి చేయూతనందించడమే భారతీయతకు అసలైన నిర్వచనమని చెప్పారు. 

 దేశ భద్రత, జాతీయభావాలతో ప్రజలంతా నడుచుకోవాలని, దేశం కాని దేశంలో వృత్తి రీత్యా శ్రమించి, పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. మాతృభాష, మాతృభూమి, మాతృ దేశాన్ని మించిన ఆస్తి, అస్తిత్వం లేవన్నారు. అమ్మ భాషలోని కమ్మ దనాన్ని, మన సంస్కృతీ, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలని, మన కట్టు, బొట్టు, భాష, యాస వదులుకోవాల్సి అవసరం లేదని తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంటూ, మానవీయ విలువలను కాపాడుకుంటూ సామాజిక బాధ్యతతో నడచుకోవటమే సనాతన జీవన విధానమని.. దాన్నే అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. తానా మాజీ అధక్షులు సతీష్ వేమన, ప్రసాద్ అడపా, కృష్ణ లామ్,  సునీల్ సింగ్, కృప సింగ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యాష్ బొద్దులూరి, భాను మాగులూరి, రవి అడుసుమిల్లి, సుధీర్ కొమ్మి, శ్రీనివాస్ గంగా, సుధా పాలడుగు, శ్రీవిద్య, పలు సంఘాల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని