కాంగ్రెస్ సవ్యసాచి అహ్మద్ భాయ్
1976 స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది రాజకీయాల్లోకి ప్రవేశించిన అహ్మద్ పటేల్ అనతి కాలంలో పార్టీలో కీలక వ్యక్తిగా మారారు. 27 ఏళ్ల వయస్సులోనే ఆయన ప్రతిభను గుర్తించిన ఇందిరాగాంధీ రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించి అసాధారణ నాయకుడిగా.......
ఇంటర్నెట్ డెస్క్: 1976 స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది రాజకీయాల్లోకి ప్రవేశించిన అహ్మద్ పటేల్ అనతి కాలంలో పార్టీలో కీలక వ్యక్తిగా మారారు. 27 ఏళ్ల వయస్సులోనే ఆయన ప్రతిభను గుర్తించిన ఇందిరాగాంధీ రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించి అసాధారణ నాయకుడిగా తీర్చి దిద్దారు. తర్వాత కాలంలో ఆయనే ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మారి పార్టీని క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించారు. ట్రబుల్ షూటర్గా పార్టీలో ఎన్నో వివాదాల్ని పరిష్కరించారు. సుదీర్ఘ కాలం సోనియా గాంధీకి రాజకీయ సలహదారుగా వ్యవహరించి ఆమెకు అత్యంత నమ్మకస్తుడిగా మారారు.
ఇందిరా గాంధీ గుర్తించడంతో..
అహ్మద్ పటేల్ 1949, ఆగస్టు 21న గుజరాత్లోని భరూచ్లో జన్మించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే యూత్ కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించారు. 1976లో తొలిసారి భరూచ్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ భరూచ్ నుంచి లోక్సభ సభ్యుడిగా బరిలోకి దింపారు. అక్కణ్నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని చాటుకున్నారు. ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మూడుసార్లు లోక్సభ, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1985లో రాజీవ్గాంధీకి పార్లమెంటు కార్యదర్శిగా వ్యవహరించారు.
సోనియాకు రాజకీయాల్లో అన్నీ తానై..
1997లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీకి రాజకీయాల్లో అహ్మద్ పటేలే అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ పరిస్థితిని వివరించి.. ముందుకు తీసుకెళ్లడంలో ఉన్న మార్గాలు, వ్యూహాలను ఆమెకు వివరించారు. సోనియా నేతృత్వంలో తిరిగి కాంగ్రెస్ పునర్వైభవం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2004, 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర ఎనలేనిదని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంత్రివర్గ కూర్పు, యూపీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవడంలో ఈ రాజకీయ దిగ్గజానిదే ప్రధాన పాత్ర.
సంక్షోభమా.. పటేల్ వైపే చూపు..
సంక్షోభం అంటే పార్టీ మొత్తం అహ్మద్ పటేల్వైపే చూసేది. పార్టీ అంతర్గత విభేదాలైనా.. ప్రభుత్వంలో సమస్యలైనా.. పటేల్ తనదైన శైలిలో పరిష్కరించేవారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకన్న సమయంలో పార్లమెంటులో పార్టీ విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో రంగంలోకి దిగిన పటేల్ తన చతురతతో ఆ సంక్షోభం నుంచి పార్టీని సునాయాసంగా గట్టెక్కించారు. పార్టీలకు అతీతంగా ఆయనకున్న సన్నిహిత సంబంధాలే ఆ సమయంలో ఆయనకు.. తద్వారా పార్టీకి ఆసరాగా నిలిచాయి. ఇటు సీనియర్లతో పాటు యువనాయకులతోనూ పటేల్కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. సీనియర్లు, జూనియర్లకు మధ్య వారధిగా ఉండేవారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఇటీవల రాజస్థాన్లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన సమయంలోనూ ఆయనతో చర్చలు జరిపి ప్రభుత్వాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించారు.
గుజరాత్పై మాత్రం పట్టు కోల్పోలేదు..
రాష్ట్ర స్థాయి రాజకీయాల నుంచి దశాబ్దాల క్రితమే దూరమైనా గుజరాత్పై పటేల్ పట్టుకోల్పోలేదు. ఇప్పటి వరకు పార్టీకి రాష్ట్రంలో పెద్ద దిక్కుగా వ్యవహరించారు. పార్టీ అధిష్ఠానానికి గుజరాత్కు మధ్య ఆయనే వారధిగా నిలిచారు. పటేల్ను దాటి గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాలు నడిచేవి కాదన్నది ప్రచారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరన్న ప్రశ్నకు అన్ని వేళ్లు పటేల్వైపే చూపేవి. 2017లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరిగిన సమయంలో పటేల్ను ఓడించడానికి భాజపాలో చాణక్యుడిగా పేరొందిన అమిత్ షా సర్వశక్తులు ఒడ్డారు. కానీ, అహ్మద్ పటేల్ అనుభవం ముందు అవేమీ చెల్లలేదు. పార్టీ శాసనభ్యులందరినీ ఏకతాటిపైకి తెచ్చి తన బలమేంటో నిరూపించుకున్నారు.
మీడియాకు దూరం..
మీడియాలో ప్రచారానికి అహ్మద్ పటేల్ ఆమడ దూరంలో ఉండేవారు. ఆయన వస్తే చాలు టీవీ, పత్రికల కెమెరాలు ఆగిపోవాలన్నది అప్పట్లో ఓ రూల్. కేవలం చెప్పిన సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలని ఆయన పాత్రికేయులను కోరేవారట. 2004, 2009 ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినప్పటికీ.. ప్రభుత్వంలో చేరడానికి మాత్రం ఇష్టపడలేదంటే ఆయన ఎంత నిరాడంబరుడో అర్థం చేసుకోవచ్చు. కానీ, వివిధ అంశాలపై యూపీఏ కూటమి పక్షాల మధ్య సమన్వయం కుదర్చడంలో మాత్రం కీలకంగా వ్యవహరించారు.
రాహుల్ టీంలోనూ..
2017లో సోనియా నుంచి రాహుల్కు పార్టీ పగ్గాలు అందిన సమయంలో పటేల్ను పక్కన పెట్టేందుకు పార్టీలో కొన్ని వర్గాలు ప్రయత్నించాయి. కానీ, అహ్మద్ భాయ్ వ్యూహాలు, కార్పొరేట్లు-పార్టీకి మధ్య ఆయన నెలకొల్పిన సంబంధాలు తిరిగి ఆయనను క్రియాశీలకంగా మార్చాయి. 2019లో పార్టీ తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్న సమయంలో కోశాధికారి బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక సమస్యలను దూరం చేసి సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేశారు.
మోదీకి మంచి స్నేహితుడు..
ఒకే రాష్ట్రానికి చెందిన ప్రధాని మోదీ, అహ్మద్ పటేల్ మంచి స్నేహితులు. అనేక విషయాలపై ఇరువురు పరస్పరం చర్చించుకునేవారు. ప్రధాని బాధ్యతలు చేపట్టడానికి ముందు ఇరువురు కలిసి అనేకసార్లు భోజనం చేశామని స్వయంగా మోదీయే ఓ సందర్భంలో ప్రస్తావించారు. పటేల్ని ముద్దుగా ‘బాబుభాయ్’ అని పిలిచేవాళ్లమని చెప్పారు.
27 ఏళ్ల వయసులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అహ్మద్ పటేల్ సుదీర్ఘ కాలం గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు. తనదైన చాతుర్యంతో సమస్యలు, వివాదాల్ని పరిష్కరించి పార్టీని అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కించారు. అలాంటిది బిహార్లో భారీ పరాభవం.. సీనియర్ల నుంచి ఎదురవుతున్న నిరసనలతో పార్టీ సతమవుతున్న తరుణంలో ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన అహ్మద్ భాయ్ లేకపోవడం కాంగ్రెస్కు తీరని లోటు!
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్