హైకోర్టును ఆశ్రయించిన రఘునందన్‌రావు

దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటనపై భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు.

Published : 13 Nov 2020 01:29 IST

హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటనపై భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలంటూ ఆయన క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన బంధువుల ఇళ్లలో రూ.18.67లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులు కట్టుకథ అల్లారని పిటిషన్‌లో రఘునందన్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ లక్ష్మణ్‌ బెంచ్‌ వద్ద విచారణకు రాగా.. ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో రఘునందన్‌ క్వాష్‌ పిటిషన్‌ను సీజే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి ఆదేశించారు. 

అసలేం జరిగిందంటే..

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేటలో గత నెల26న రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. రఘునందన్‌రావు మామ, అంజన్‌రావు అనే మరో వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. ఈక్రమంలో అంజన్‌రావు ఇంట్లో రూ.18.67లక్షలు లభించాయని.. ఆ సొమ్మును ఉప ఎన్నికలో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసినట్లు తెలిసిందని అప్పట్లో సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు. పోలీసులు సోదాలు చేసిన సమయంలో భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో తోపులాట జరిగింది. సీజ్‌ చేసిన నగదు తీసుకొస్తున్న సమయంలో కొంతమంది భాజపా కార్యకర్తలు రూ.12.80లక్షలను పోలీసుల నుంచి లాక్కెళ్లినట్లు సీపీ చెప్పారు. వీడియో ఫుటేజీ ఆధారంగా క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల క్షేత్రం నుంచి తనను తప్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కుట్ర చేస్తోందని రఘునందన్‌ అప్పట్లో ఆరోపించారు. అదే కేసుపై తాజాగా ఆయన‌ హైకోర్టును ఆశ్రయించారు. 

ఇదీ చదవండి..

సిద్దిపేట రణరంగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని