దుబ్బాకలో భాజపా జయకేతనం

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉపఎన్నికలో భాజపా జయకేతనం

Updated : 10 Nov 2020 20:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన సోలిపేట సుజాతపై విజయదుందుభి మోగించారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచీ ఆధిక్యం ప్రదర్శించిన కాషాయ పార్టీ మధ్యలో కాస్త తడబడినప్పటికీ చివరిలో పుంజుకుని అంతిమంగా విజయాన్ని ముద్దాడింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భాజపా శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి.

మొత్తం 23 రౌండ్లలో జరిగిన లెక్కింపు ప్రక్రియ తీవ్ర ఉత్కంఠగా సాగింది. రౌండ్‌ రౌండ్‌కూ  తెరాస, భాజపా మధ్య విజయం దోబూచులాడింది. మొదటి ఐదు రౌండ్లతో పాటు 8, 9, 11, 20, 22, 23 రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించగా..6, 7, 10, 13, 14, 15, 16, 17, 18, 19 రౌండ్లలో అధికార తెరాస హవా కొనసాగింది. 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌ ముందంజలో నిలిచింది. మొత్తం 23 రౌండ్లు. భాజపా  12 రౌండ్లలో ఆధిక్యం కనబరిచింది. తెరాస 10 రౌండ్లలో గెలిచింది. ఒక రౌండ్‌లో కాంగ్రెస్‌ ముందుంది. అయితే భాజపా, తెరాస మధ్య స్వల్వ ఆధిక్యమే ఉండటంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై చివరి వరకు స్పష్టత రాలేదు. 23వ రౌండ్‌లో భాజపా 412 ఓట్లు ఆధిక్యం సాధించడంతో అప్పటికే 1058 మెజార్టీతో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి రఘునందర్‌రావు 1079 ఓట్ల ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని