​​​​​నాదీ సేమ్‌ డైలాగ్.. ప్రధానికి చిదంబరం ట్వీట్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి ప్రధాని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. గుజరాత్‌......

Published : 02 Sep 2020 19:35 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి ప్రధాని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ చేసిన ట్వీట్‌ను ఇప్పుడు జతచేస్తూ ‘నేనూ అదే అడుగుతున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

2013లో యూపీఏ-2 ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిదంబరం ఆర్థికమంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో చిదంబరాన్ని ఉద్దేశిస్తూ నరేంద్రమోదీ ఘాటు ట్వీట్‌ చేశారు. ‘‘ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతోంది. యువత ఉద్యోగాలు కోరుకుంటున్నారు. చిదంబరం గారూ.. రాజకీయాలు మాని ఆర్థిక వ్యవస్థ గురించి సమయం కేటాయించండి. ఉద్యోగాలు ఇవ్వడంపై దృష్టి సారించండి’’ అని ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ తాలూకా స్క్రీన్‌షాట్‌ను చిదంబరం ట్వీట్‌ చేస్తూ తాను ఇప్పుడు అదే అడుగుతున్నా అంటూ ఎద్దేవాచేశారు.

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి దేశ జీడీపీ 23.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల తలెత్తే ఆర్థిక సంక్షోభం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, నెలల ముందు హెచ్చరించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని