
కాంగ్రెస్ నుంచి మరిన్ని ఫిరాయింపులు : రూపానీ
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అన్నారు. నవంబర్ 3న రాష్ట్రంలో ఎనిమిది సీట్లకు ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుంచి మరిన్ని ఫిరాయింపులు ఉంటాయని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన వల్సాద్ జిల్లా కప్రాడ నియోజవకర్గంలో భాజపా అభ్యర్థి జితు చౌధురికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ రూపానీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమవుతోందని, అది మునిగిపోయే పడవగా మారిందన్నారు. కార్యకర్తలకు సైతం ఆ పార్టీ నాయకత్వంపై విశ్వాసం ఉండటంలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ సమర్థతపైనా ప్రశ్నలు వస్తున్నాయని, వారసత్వ రాజకీయాల నుంచి కార్యకర్తలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని రూపానీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల నియోజకవర్గ ప్రజలకు ఏ పనీ చేయలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. జితు చౌధురి కూడా తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే భాజపాలోకి వచ్చి చేరారని తెలిపారు. 2017లో 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడగా.. 2018లో ఆరుగురు, తాజాగా ఎనిమిది మంది ఆ పార్టీకి గుడ్బై చెప్పారని వివరించారు. ఈ ఏడాది జూన్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులకు పాల్పడి భాజపా అభ్యర్థికి మద్దతు తెలిపారు. కాంగ్రెస్కు రాజీనామా చేయడంతో నవంబర్ 3న ఇక్కడ ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికలు జరుగున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.