గ్రేటర్  తీర్పు: అప్పుడలా.. ఇప్పుడిలా..!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఒక్క నేరెడ్‌మెట్‌ మినహా గ్రేటర్‌లో పూర్తి ఫలితాలు వచ్చేశాయ్‌. ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకొని తెరాస....

Published : 05 Dec 2020 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఒక్క నేరెడ్‌మెట్‌ మినహా గ్రేటర్‌లో పూర్తి ఫలితాలు వచ్చేశాయ్‌. ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకొని తెరాస అతి పెద్ద పార్టీగా అవతరించగా.. భాజపా రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఇకపోతే, మజ్లిస్‌ పార్టీ తన కోటను పదిల పర్చుకుంది. 2016 గ్రేటర్‌ ఎన్నికలతో పోలిస్తే అధికార తెరాసకు సీట్లు భారీగా తగ్గగా.. దూకుడుగా వెళ్లిన కమలనాథులు రికార్డుస్థాయిలో బలం పుంజుకొని నగరంలో ఓ బలమైన శక్తిగా అవతరించారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్‌ చతికిలపడింది. 2009 నుంచి 2020 వరకు జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లు, పోలింగ్‌ సరళి, ఆయా పార్టీలు సాధించిన ఫలితాల సరళిని ఓసారి పరిశీలిస్తే.. 

2020లో..
తాజాగా జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో మొత్తంగా 74,67,256 ఓట్లర్లు ఉండగా.. 34,50,331 ఓట్లు (46.55%) ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తంగా 1122 మంది బరిలో నిలిచారు. 2016 ఎన్నికలతో పోలిస్తే తెరాసకు గట్టి షాకే తగిలింది. గ్రేటర్‌లో ఆ పార్టీకి గతంలో 99 స్థానాలు ఉండగా.. ఆ సంఖ్య 55కి పడిపోయింది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి తన కోటను పదిలపర్చుకుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో జీహెచ్‌ఎంసీ బరిలోకి దూకిన భాజపా.. భారీగా బలం పుంజుకొని 48 డివిజన్లలో కాషాయ జెండాను ఎగురవేసి సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా కేవలం రెండు స్థానాలకే పరిమితమై ఘోర పరాభవాన్నే చవిచూసింది.

2016లో..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత జీహెచ్‌ఎంసీకి 2016లో జరిగిన ఎన్నికల్లో బరిలోకి దిగిన తెరాస తిరుగులేని విజయం సాధించి గ్రేటర్‌ పీఠం కైవసం చేసుకొంది. ఆ ఎన్నికల్లో మొత్తం 70,67,934 మంది ఓటర్లు ఉండగా.. 33,60,543 మంది ఓటర్లు (45.25%)మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పుడు 1333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే, 2016లో గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస 150 స్థానాల్లో పోటీచేసి 99 స్థానాలు గెలుచుకొని చారిత్రక విజయం సాధించింది. 149 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాలకు పడిపోయి ఘోర పరాభవం ఎదుర్కొంది. ఈ ఎన్నికల్లో భాజపా, తెదేపా కలిసి పోటీ చేశాయి. 95 స్థానాల్లో పోటీచేసిన తెదేపా ఒక్క స్థానం గెలుచుకోగా.. 55 స్థానాల్లో బరిలో దిగిన కమలనాథులు నాలుగు స్థానాల్లో గెలిచారు. ఇక ఎంఐఎం విషయానికి వస్తే.. 60స్థానాల్లో పోటీచేసి 44 స్థానాల్లో విజయఢంకా మోగించింది.  

2009లో..
ఉమ్మడి ఏపీలో 2009 జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో మొత్తం 56,99,015 ఓట్లు ఉండగా.. 24,08,001 ఓట్లు  (44.15%) మాత్రమే పోలయ్యాయి. అప్పట్లో 1310 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ ఎన్నికలకు తెరాస దూరంగా ఉంది. కాంగ్రెస్‌ 149 స్థానాల్లో పోటీచేసి 52 స్థానాలు గెలుచుకోగా.. భాజపా 138 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించి కేవలం 5 స్థానాలే దక్కించుకోగలిగింది. ఎంఐఎం 70 స్థానాల్లో పోటీచేసి 43 స్థానాలు గెలుచుకోగా.. 139 స్థానాల్లో పోటీచేసిన తెదేపా అభ్యర్థులు 45 స్థానాల్లో విజయం సాధించారు. అయితే, మజ్లిస్‌తో కలిసి కాంగ్రెస్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోగలిగింది. 

ఇదీ చదవండి

గ్రేటర్‌లో కళ తప్పిన ‘హస్తం’!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని