గ్రేటర్‌ పోల్స్‌: ఈ నగరానికి  ఏమైంది?

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. ఎప్పటిలాగే గ్రేటర్‌ ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ మందకొడిగానే సాగింది. సాయంత్రం 5గంటల వరకు కేవలం 36.73 శాతం ఓటర్లు మాత్రమే ఓటువేశారు. సాయంత్రం 6గంటల వరకు

Updated : 02 Dec 2020 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. ఎప్పటిలాగే గ్రేటర్‌ ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ మందకొడిగానే సాగింది. సాయంత్రం 5గంటల వరకు కేవలం 36.73 శాతం ఓటర్లు మాత్రమే ఓటువేశారు. సాయంత్రం 6గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇవ్వడంతో ఈ శాతం మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం 1గంట వరకు ఒక్కశాతం కూడా పోలింగ్‌ నమోదు కాని డివిజన్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పోలింగ్‌ పట్ల నగరవాసుల్లో ఎంత అనాసక్తి ఉందో ఈ పోలింగ్‌ సరళిని బట్టే అర్థమవుతోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం, జనంలో నెలకొన్న కరోనా భయం వెరసి గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌పై కొంత ప్రభావం చూపించాయి. 

ప్రచారం ఎక్కువ‌.. ఓటింగ్ తక్కువ‌!
గత ఎన్నికలకు భిన్నంగా ఈసారైనా ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. పలువురు సెలబ్రిటీలు సైతం ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం నిర్వహించారు. రాజకీయ పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. తెరాస, భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగింది. భాజపా అగ్ర నేతలు సైతం హైదరాబాద్‌ నగరానికి వచ్చి ప్రచారం హోరెత్తించడంతో రాజకీయం మరింతగా హీటెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో కనీసం ఈసారైనా పోలింగ్‌ 50శాతం దాటుతుందని అందరూ ఆశించినా.. గత రెండు ఎన్నికల కన్నా తక్కువ పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. 

ఈ మధ్యాహ్నం 1గంట వరకు అమీర్‌పేట, తలాబ్‌ చంచలం డివిజన్లలో కనీసం ఒక్క శాతం కూడా నమోదు కాలేదు. షేక్‌పేట, సోమాజిగూడ, శాలిబండ, అత్తాపూర్‌,  బేగంబజార్‌, జియాగూడ, కార్వాన్‌, అల్విన్‌ కాలనీ, సుభాష్‌నగర్‌, జంగంమెట్‌ డివిజన్లలో పోలింగ్‌ ఐదు శాతాన్ని కూడా దాటలేకపోవడం గమనార్హం.

గతంలో ఓటింగ్‌ శాతం ఇలా..
తాజా ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీలో మొత్తంగా 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 38,56,770 (52.09%) మంది పురుషులు కాగా, 35,46,487 (47.90%) మంది మహిళా ఓటర్లు. ఇతరులు 669 (0.01%) మంది ఉన్నారు. ఇందుకోసం గ్రేటర్‌ పరిధిలో 9238 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఓటింగ్‌ శాతం చాలా తక్కువగా నమోదైంది. 2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 42.04శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2016లో 45.29శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. 
నగరంతో పోలిస్తే శివార్లలోనే ఎక్కువగా పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు భావిస్తున్నారు. ఆర్‌సీపురం, పటాన్‌ చెరు, అంబర్‌పేట సర్కిళ్లలో అత్యధికంగా పోలింగ్‌ నమోదు కాగా.. మలక్‌పేట, కార్వాన్‌ సర్కిళ్లలో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైనట్టు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని