యూడీఎఫ్‌కు బై.. ఎల్‌డీఎఫ్‌కు హాయ్‌..!

ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కేరళలోని యునైటెడ్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) చీలిపోయింది. యూడీఎఫ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు కేరళ కాంగ్రెస్‌ (ఎం) కార్యనిర్వాహక ఛైర్మన్‌ జోస్‌ కే మణి

Updated : 14 May 2022 10:50 IST

కేరళ అధికార పక్ష కూటమితో కేరళ కాంగ్రెస్‌ (ఎం) జట్టు

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన పార్టీ ఛైర్మన్‌ జోస్‌ కే మణి

తిరువనంతపురం: ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కేరళలోని యునైటెడ్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) చీలిపోయింది. యూడీఎఫ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు కేరళ కాంగ్రెస్‌ (ఎం) కార్యనిర్వాహక ఛైర్మన్‌ జోస్‌ కే మణి తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేరళ అధికార వామపక్ష కూటమి లెఫ్ట్‌ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఫ్‌)లో చేరారు. యూడీఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌ (ఎం) దాదాపు 38 ఏళ్ల తర్వాత విడిపోవడం గమనార్హం.

యూడీఎఫ్‌ మద్దతుతోనే మణి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. యూడీఎఫ్‌ కూటమిలో జాతీయ కాంగ్రెస్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, పీజే జోసెఫ్ నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్‌ (ఎం), కేరళ కాంగ్రెస్‌ (జాకబ్‌) పార్టీలు ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ (ఎం)‌లోని తన వైరి వర్గం పీజే జోసెఫ్‌ వర్గానికి యూడీఎఫ్‌ అండగా నిలబడటంతో జోస్‌ కే మణి జీర్ణించుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది కేరళ కాంగ్రెస్‌ (ఎం) ఛైర్మన్‌ కేఎం మణి (జోస్‌ కె మణి తండ్రి) మృతితో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.

యూడీఎఫ్‌ శిబిరంలో తమ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని జోస్ కే మణి ఆరోపించారు. తాము తీసుకున్న నిర్ణయం తర్వాత కేరళ రాజకీయాలు చాలా మార్పులకు గురికాబోతున్నాయని వ్యాఖ్యానించారు. కేరళ కాంగ్రెస్‌ (ఎం) తరఫున గెలిచిన కొట్టాయం లోక్‌సభ సభ్యుడు థామస్‌ ఛాజికడమ్‌ మాత్రం రాజీనామా చేయబోరని వెల్లడించారు. కేరళ కాంగ్రెస్‌ (ఎం) నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వాగతించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను బలోపేతం చేస్తుందని తెలిపారు. సెంట్రల్‌ ట్రావెన్‌కోర్‌ ప్రాంతంలో కేరళ కాంగ్రెస్‌ (ఎం) బలమైన పార్టీ కావడంతో మైనారిటీ ఓట్లను ఆకర్షించవచ్చని అధికార ఎల్‌డీఎఫ్‌ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు