డీఎంకే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోం: కమల్‌

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పొత్తు ఉండదని మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆర్థిక విప్లవంపై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు....

Published : 23 Dec 2020 01:52 IST

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పొత్తు ఉండదని మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆర్థిక విప్లవంపై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను తీసుకువస్తామన్న కమల్‌.. ప్రజల గుమ్మం ముందుకే సేవలను అందిస్తామన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి వలసలను కట్టడి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని కాగిత రహితంగా మారుస్తామని, డిజిటల్‌ గవర్నెన్స్‌ను తెస్తామన్నారు. ప్రజలకు అవసరమైన ధృవపత్రాలను వారి స్మార్ట్‌ ఫోన్లకే పంపిస్తామన్నారు. ప్రతి ఇంటికి కంప్యూటర్‌తోపాటు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.

తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు తమ ప్రచారంపై దృష్టి సారించాయి. కమల్‌ హాసన్‌ కొద్దిరోజుల క్రితమే మదురై నుంచి ప్రచారం ప్రారంభించారు. ఏళ్ల తరబడి ఎదురుచూపులకు తెరదించుతూ రజినీకాంత్‌ సైతం తమిళ రాజకీయాల్లో ఆరంగేట్రం చేశారు. పార్టీ పెట్టబోతున్నానని, పూర్తి వివరాలను డిసెంబర్‌ 31న వెల్లడిస్తానని పేర్కొన్నారు. మక్కళ్‌ సేవై కట్చి పేరుతో రజినీ ఎన్నికల సంఘంలో పార్టీని నమోదు చేసినట్లు, ఆయనకు ఆటో గుర్తును కేటాయించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇవీ చదవండి...

కమల్‌ హాసన్‌తో జట్టుకట్టనున్న ఒవైసీ!

‘ఆకలితో అలమటిస్తుంటే నూతన పార్లమెంటా?’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని