బెంగాల్‌ పోలీసుఅధికారులపై కేంద్రం కొరడా

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమబెంగాల్‌లో దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, బెంగాల్‌ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. బెంగాల్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్‌

Updated : 13 Dec 2020 04:37 IST

దిల్లీ: భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమబెంగాల్‌లో దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, బెంగాల్‌ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. బెంగాల్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను డిప్యుటేషన్‌పై కేంద్రంలోకి రప్పిస్తూ హోంమంత్రిత్వ శాఖ శనివారం  సమన్లు జారీ చేసింది. దీంతో ఈ పరిణామాలు ఇరుపక్షాల మధ్య మరింత వేడిని పెంచాయి. 

పశ్చిమబెంగాల్‌ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్న డైమండ్‌ హార్బర్‌ ఎస్పీ భోల్‌నాథ్‌ పాండే, ప్రెసిడెన్సీ రేంజ్‌ డీఐజీ ప్రవీణ్‌ త్రిపాఠి, దక్షిణ బెంగాల్‌ అదనపు డీజీ రాజీవ్‌ మిశ్రాలను కేంద్రంలో పనిచేయాలని పిలిచింది. నడ్డా పర్యటనకు భద్రత కల్పించడంలో విఫలమైనందున ఈ సమన్లు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆల్‌ ఇండియా సర్వీస్‌ ఆఫీసర్లపై ఉన్న నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సాధారణంగా అఖిల భారత సర్వీసు అధికారిని డిప్యుటేషన్‌పై కేందంలోకి తీసుకునేప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి తీసుకుంటారు. అయితే తాజా ఘటనలో కేంద్ర హోంశాఖ బెంగాల్‌ ప్రభుత్వం సమ్మతి లేకుండానే ఏకపక్షంగా సమన్లు జారీ చేయడం గమనార్హం. 

అయితే హోంశాఖ నిర్ణయాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బెంగాల్‌లో అత్యవసర పరిస్థితి విధించాలని హోంమంత్రి అమిత్ షా పరోక్షంగా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టింది. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. 

 గురువారం జేపీ నడ్డా వాహనశ్రేణిపై పశ్చిమబెంగాల్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. తృణమూల్‌ మద్దతుదారులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భాజపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ, డీజీపీలకు కేంద్ర హోంశాఖ శుక్రవారం సమన్లు జారీ చేసింది. దీన్ని తీవ్రంగా ఖండించిన తృణమూల్‌ ప్రభుత్వం తమ ఉన్నతాధికారులను దిల్లీకి పంపించకూడదని నిర్ణయించింది. 

ఇదీ చదవండి..

కేంద్రం వర్సెస్‌ పశ్చిమబెంగాల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు