‘కొడాలి వ్యాఖ్యలు ఆ ఉద్దేశాన్ని బయటపెట్టాయి’

అమరావతిపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజధానిని పూర్తిస్థాయిలో తరలించాలన్న ఉద్దేశాన్ని బట్టబయలు చేశాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 08 Sep 2020 15:46 IST

దిల్లీ: అమరావతిపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజధానిని పూర్తిస్థాయిలో తరలించాలన్న ఉద్దేశాన్ని బట్టబయలు చేశాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రభుత్వ వైఖరిని మంత్రి కొడాలి నాని ప్రకటించారని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తేటతెల్లం చేశాయన్నారు. దిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. కోర్టులో కేసులు ఉపసంహరించుకోకుంటే శాసన రాజధానిని కూడా తరలిస్తామని బెదిరిస్తున్నట్లుగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దీనిపై అమరావతి రైతులు హైకోర్టులో అదనపు అపిడవిట్‌ దాఖలు చేస్తే మంచిదని రఘురామకృష్ణరాజు సూచించారు. 

శ్రీకాకుళంలో కాదు.. కడపలో మొదలుపెట్టండి

ఉచిత విద్యుత్‌ నగదు బదిలీపై రైతులకు సందేహాలు, అపోహలు ఉన్నాయని రఘురామకృష్ణరాజు అన్నారు. రైతుల ఆందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ప్రజలకు నగదు బదిలీపై నమ్మకం కలగడం లేదని చెప్పారు. ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకాన్ని శ్రీకాకుళంలో కాకుండా కడపలో మొదలు పెట్టాలని ఎంపీ సూచించారు. అక్షరాస్యతలో ఏపీ చివరిస్థానంలో నిలవడం విచారకరమన్నారు. అంతర్వేది రథం దగ్ధం విషయంలో సిట్ ఏర్పాటు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు సూచించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని