‘మాపై కాదు.. కేంద్రంపై వేయాలి ఛార్జ్‌షీట్‌’

నగరానికి ఇప్పుడు కావాల్సింది ఛార్జ్‌షీట్లు కాదని.. అభివృద్ధి షీట్లని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆరేళ్లలో తెరాస 60 వైఫల్యాలంటూ...

Updated : 22 Nov 2020 18:06 IST

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్‌: నగరానికి ఇప్పుడు కావాల్సింది ఛార్జ్‌షీట్లు కాదని.. అభివృద్ధి షీట్లని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆరేళ్లలో తెరాస 60 వైఫల్యాలంటూ భాజపా నేతలతో కలిసి కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు ఏం చేస్తారో చెప్పాలి కానీ..  రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, తెలంగాణను అభివృద్ధి చేసినందుకు ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్‌ వేస్తారా? అని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పినందుకు కేంద్ర ప్రభుత్వంపైనే ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని మంత్రి వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలిస్తే ప్రభుత్వరంగ సంస్థలతో పాటు హైదరాబాద్‌నూ అమ్మేస్తారని విమర్శించారు. శాసన మండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ భాజపాలోకి వెళ్లారని వస్తున్న వార్తలపై శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించారు. స్వామిగౌడ్‌ ఎప్పటికీ భాజపాలోకి వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు. మామూలు స్థాయిలో ఉన్న తనను ప్రోటోకాల్ స్థానంలో సీఎం కేసీఆర్‌ కూర్చోబెట్టారని స్వామిగౌడ్‌ గతంలో అన్నారని పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

గ్లోబల్‌ సిటీ అని...ఫ్లడ్‌ సిటీగా మార్చారు
ప్రకాశ్‌ జావడేకర్‌పై రేవంత్‌రెడ్డి ఛార్జ్‌షీట్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని