జేడీయూకు కొత్త సారథి

బిహార్‌లో జనతా దళ్‌ (యునైటెడ్‌) పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి నీతీశ్‌ కుమార్‌ తప్పుకొన్నారు. ఆర్‌సీపీ సింగ్‌ నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో....

Published : 28 Dec 2020 01:03 IST

పట్నా: జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ తప్పుకొన్నారు. ఆర్‌సీపీ సింగ్‌ (రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌) నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడైన ఆర్‌సీపీ సింగ్‌ పేరును నీతీశ్‌ ప్రతిపాదించగా.. పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

యూపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆర్‌సీపీ సింగ్‌.. నీతీశ్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. నీతీశ్‌ సీఎం అయిన తర్వాత ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వ్యవహరించారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. జేడీయూ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నీతీశ్‌ కుమార్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన సింగ్‌.. ప్రస్తుతం జేడీయూ పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 2019లో మూడేళ్ల కాలానికి నీతీశ్‌ అధ్యక్షుడిగా నియమితులైనప్పటికీ మధ్యలోనే పార్టీ బాధ్యతలను సింగ్‌కు అప్పగించారు. 

మరోవైపు ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఆరుగురు జేడీయూ సభ్యులు భాజపా తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశం ప్రధానంగా సమావేశంలో చర్చకు వచ్చిందని పార్టీ నేత ఒకరు తెలిపారు. దాంతో పాటు ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులు, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల అంశాలపైనా చర్చించినట్లు చెప్పారు.

ఇవీ చదవండి..
జమిలి ఎన్నికలపై భాజపా నేతృత్వంలో 25 వెబినార్లు

కిసాన్‌ సంఘర్ష్‌ సమితికి ఆంధ్ర రైతుల సాయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని