35ఏళ్లుగా MLA కాదు.. కానీ 6సార్లు సీఎంగా!

బిహార్‌లో వికాస్‌ పురుష్‌గా, క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న నేతగా ప్రజల్లో మంచి పేరున్న నేత నితీశ్‌ కుమార్‌. ఇప్పటికే ఐదుసార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. మరోసారి తనకు ఛాన్స్‌ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. బిహార్‌ను అభివృద్ధి బాట పట్టించిన .........

Updated : 02 Nov 2020 22:39 IST

నీతీశ్‌కుమార్‌ గురించి ఈ ఆసక్తికర అంశం తెలుసా? 

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిహార్‌లో వికాస్‌ పురుష్‌గా, క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న నేతగా ప్రజల్లో మంచి పేరున్న నేత నీతీశ్‌కుమార్‌. ఇప్పటికే ఆరుసార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. మరోసారి తనకు ఛాన్స్‌ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. బిహార్‌ను అభివృద్ధి బాట పట్టించిన నీతీశ్‌కు ఈ ఎన్నికలు నల్లేరుమీద నడకేలా ఏమీ కనబడటంలేదు. గతంతో పాలకులతో పోలిస్తే రాష్ట్రంలో నీతీశ్‌ అభివృద్ధి వెలుగులు నింపినప్పటికీ.. తాజాగా పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య ఆయన్ను నీడలా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నీతీశ్‌కు సవాళ్ల మీద సవాళ్లు విసరుతున్నారు. రాష్ట్రంలో ఏదోఒక స్థానం నుంచి పోటీకి నిలబడి నిరూపించుకోవాలని ఛాలెంజ్‌ చేస్తుండటంతో గత 35 ఏళ్లుగా నీతీశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, నీతీశ్‌ మాత్రం ఈ సవాల్‌ను అంత సీరియస్‌గా తీసుకోకుండా మరోసారి బిహార్‌ కోటలో పాగా వేయడమే లక్ష్యంగా తనదైన శైలిలో ఎన్నికల ప్రణాళికను కొనసాగిస్తున్నారు. 

తొలిసారి ఎనిమిది రోజులే సీఎంగా..
నీతీశ్‌ కుమార్‌ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఆరు పర్యాయాలు బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 సంవత్సరంలో ఎనిమిది రోజుల పాటే ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత 2005, 2010, 2015, 2017లలో సీఎంగా బాధ్యతలు నిర్వహించి బిహార్‌లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. అయితే, ఆరు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగినా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచీ ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం. ఎందుకంటే శాసనమండలి సభ్యుడిగా ఉంటూ ఆయన సీఎంగా సేవలందిస్తూ వస్తున్నారు. 

ఎంపీగా ఆరుసార్లు..
1977లో నీతీశ్‌ కుమార్‌ నలంద జిల్లాలోని హర్నాట్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ 1985లో అదే స్థానం నుంచి బరిలో దిగి రికార్డుస్థాయి మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఆ తర్వాత 1989, 1991, 1996, 1998, 1999, 2004 సంవత్సరాల్లో వరుసగా ఆరు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం 1985 ఎన్నికలే చివరవి.  తొలిసారి 2000లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. అయితే, అసెంబ్లీలో తనకు సరైన మెజార్టీ లేకపోవడంతో కేవలం ఎనిమిది రోజులకే (మార్చి 3 నుంచి 10 వరకు) రాజీనామా చేయాల్సి వచ్చింది. 

ఆ నిబంధన ప్రకారమే..

2005 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా- జేడీయూ కూటమి గెలుపొందింది. దీంతో నీతీశ్‌ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు కూడా ఆయనకు ఏ చట్టసభలోనూ సభ్యత్వం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 (4) సెక్షన్‌ ప్రకారం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఏదో ఒక సభ (అసెంబ్లీ లేదా శాసనమండలి)కు సభ్యుడిగా ఎన్నికవ్వాలనే నిబంధన ఉంది. దీంతో 2006లో నీతీశ్‌ శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవీకాలం 2012 వరకు ఉండగానే 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భాజపా - జేడీయూ కూటమి భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడంతో ఆయన‌ వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. 2012లో ఎమ్మెల్సీగా తన పదవీ కాలం ముగియడంతో మళ్లీ మండలికే ఎన్నికయ్యారు.

అనంతరం 2013లో భాజపాతో ఉన్న స్నేహాన్ని తెంచుకొని దేశాన్ని ఆశ్చర్యపరిచిన నీతీశ్.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగారు. మోదీ వేవ్‌ కారణంగా జేడీయూకి ఘోర పరాభవం ఎదురవ్వడంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. దీంతో అప్పట్లో జేడీయూలో ఉన్న జితిన్‌ రాం మాంఝీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2015 ఫిబ్రవరిలో జితిన్‌ రాం మాంఝీ జేడీయూ నుంచి బహిష్కరణకు గురవ్వడంతో నీతీశ్‌ నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాకూటమిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన‌ ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నుంచి లాలూ తనయుడు తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతల్లో ఉన్నారు. ఆ సమయంలో తేజస్వీపై అవినీతి ఆరోపణలు రావడంతో నీతీశ్‌ ఆయన్ను కేబినెట్‌ నుంచి తొలగించారు. దీనికి ఆర్జేడీ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో 2017 జులైలో నీతీశ్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో మహా కూటమి చీలిపోయింది. అనంతరం కొద్ది గంటల్లోనే బిహార్‌లోని రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మళ్లీ ఎన్డీయే కూటమితో దోస్తీ కట్టిన నీతీశ్‌ కొద్ది గంటల్లోనే మళ్లీ సీఎం పీఠం దక్కించుకున్నారు. 2018లో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నీతీశ్‌ పదవీ కాలం 2024 నాటికి పూర్తి కానుంది.

ప్రజలను నేరుగా ఎదుర్కొనేందుకు నీతీశ్‌ భయపడుతున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు పదేపదే విమర్శిస్తుంటారు. శాసనమండలి నుంచి ఎన్నికవ్వడమే ఆయన తనకు సురక్షితమని భావిస్తున్నారని అంటుంటారు. అయితే, ఇలాంటి విమర్శలకు గతంలో నీతీశ్‌ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను ఒక్క స్థానానికే పరిమితం కావాలనుకోవడంలేదని, అందుకే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడంలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు, బిహార్‌లో రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 17 జిల్లాల పరిధిలోని 94 స్థానాలకు రేపు పోలింగ్‌ జరగనున్న వేళ నిన్నటితో ప్రచార గడువు ముగిసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని