కొవిడ్‌ వ్యాక్సిన్‌ లభించేది ఇక్కడే...

కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎవరు ఎన్ని దేశాలు తిరిగినా అది లభించేది పుణెలో మాత్రమే అని ఎంపీ సుప్రియా సూలే అన్నారు.

Published : 29 Nov 2020 16:40 IST

ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే వ్యాఖ్య

పుణె: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచం మొత్తం తిరిగినా అది లభించేది మాత్రం పుణెలోనేనని శరద్‌ పవార్‌ కుమార్తె, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) పర్యటన సందర్భంగా.. ఆమె ఈ పరోక్ష వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ఇక్కడి తాలెగావ్‌ దభాడే పట్టణంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో సుప్రియ మాట్లాడుతూ.. ‘‘ఆయన (మోదీ) పుణెలో పర్యటించారు. వ్యాక్సిన్‌ కోసం ప్రపంచం మొత్తం తిగినా.. చివరికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పుణెలోనే లభించనుంది. ఈ నగరం ఎందులోనూ తీసిపోదు. కరోనాకు వ్యాక్సిన్‌ను పుణె వారే కనుగొన్నారు. లేదంటే ఆ ఘనత నాదేనని వేరెవరో చెప్పుకునే వారు’’ అని సుప్రియ చురకలంటించారు. ప్రస్తుతం ఆమె బారామతి లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కరోనా టీకా ‘కొవిషీల్డ్‌’ను బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ విద్యాలయం, ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, దీనిని స్థానికంగా తయారుచేసేందుకు ఎస్‌ఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధంగా ఉత్పత్తి కానున్న కొవిడ్‌ టీకాను తొలుత భారత్‌లోనే పంపిణీ చేస్తామని ఆ సంస్థ సీఈఓ అదార్‌ పూనావాలా పీఎం పర్యటన సందర్భంగా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని