ధైర్యవంతులనే సరిహద్దులకు పంపుతారు: పైలట్

సుమారు నెల రోజుల రాజకీయ అనిశ్చితి తర్వాత రాజస్థాన్‌ శాసనసభ శుక్రవారం సమావేశమయింది. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్ సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది....

Updated : 14 Aug 2020 16:30 IST

అసెంబ్లీలో సీటు మార్పుపై సచిన్‌ వ్యాఖ్యలు

జైపుర్‌: సుమారు నెల రోజుల రాజకీయ అనిశ్చితి తర్వాత రాజస్థాన్‌ శాసనసభ శుక్రవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్ సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తిరుగుబాటు అనంతరం సొంత గూటికి చేరుకున్న సచిన్‌ పైలట్‌ ఉప ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీలో ఆయన స్థానాన్ని అధికార పక్షానికి దూరంగా ప్రతిపక్షాలకు దగ్గరగా కేటాయించారు. దీనిపై సచిన్ తనదైన శైలిలో స్పందిచారు. ‘‘ నేను కూర్చునే సీటును ప్రతిపక్షాలకు దగ్గరగా, అధికార పక్షానికి దూరంగా చివరన ఎందుకు కేటాయించారో తెలుసా?.. ధైర్యవంతులు, శక్తిమంతులైన సైనికులనే ఎప్పుడూ సరిహద్దులకు పంపుతారు’’ అని పైలట్ వ్యాఖ్యానించారు.

నెల రోజుల క్రితం అశోక్‌ గెహ్లోత్‌తో విభేదించిన సచిన్‌ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. పలు నాటకీయపరిణామాల తర్వాత అధిష్ఠానంతో పైలట్‌ జరిపిన చర్చలు సఫలం కావడంతో తిరిగి ఆయన కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. దీంతో బలనిరూపణ కోసం శుక్రవారం అసెంబ్లీ సమావేశమైంది. 200 మంది సభ్యులు ఉన్న రాజస్థాన్‌ అసెంబ్లీలో మెజారిటీకి 101 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున 107 మంది ఉండగా, ప్రతిపక్షం భాజపా తరఫున 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వతంత్రులు, చిన్న పార్టీల ఎమ్మెల్యేలతో కలిపి కాంగ్రెస్‌ సంఖ్యా బలం 125కి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని