తిరుపతిలో విజయానికి టీడీపీ ఐదంచెల వ్యూహం

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అందుకోసం అడుగులు వేస్తోంది. పార్టీ విజయం కోసం ఐదంచెల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది....

Published : 29 Dec 2020 15:30 IST

సిద్ధంగా ఉన్న 8వేల బూత్‌ లెవల్‌ కార్యకర్తలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అందుకోసం అడుగులు వేస్తోంది. పార్టీ విజయం కోసం ఐదంచెల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. షెడ్యూల్‌ ప్రకటన, నోటిఫికేషన్‌కు ముందునుంచే ప్రణాళికలు తయారుచేసుకున్న ప్రతిపక్షం ఇప్పటికే 8వేల మంది బూత్‌ లెవల్‌ కార్యకర్తలను  సిద్ధం చేసుకుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండలాలకు పరిశీలకులుగా 89 మంది సీనియర్‌ నేతలను నియమించింది. ఇతర పార్టీలకన్నా ముందే పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని అధినేత చంద్రబాబు ప్రకటించి ప్రచారం మొదలయ్యేలా చేశారు. పార్టీకి రాజకీయ విశ్లేషకుడిగా ఉన్న రాబిన్‌ శర్మ ఇప్పటికే తిరుపతిలో మకాం వేశారు. ఆయన బృందం తిరుపతి ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 

2024 అసెంబ్లీ ఎన్నికల వరకు తమకు వ్యూహాలు రూపొందించేందుకు ‘షో టైం’ కన్సల్టెన్సీతో తెలుగుదేశం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. గత ఎన్నికల్లో వైకాపాకు పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్ ఐ ప్యాక్‌ సంస్థలో రాబిన్‌ శర్మ కీలక పాత్ర పోషించారు. తర్వాత సొంతంగా షో టైం కన్సల్టెన్సీ ఏర్పాటుచేసిన రాబిన్‌ శర్మ 2024 వరకు తెదేపా వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు.వారు ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో తమ బృందాలను ఏర్పాటుచేసుకొని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుంటున్నారు.

గత ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ పరిధిలో వైకాపాకు వచ్చిన మెజారిటీ మండలాలపై తెదేపా విశ్లేషణ ప్రారంభించింది. జనవరి నుంచి గ్రామాల వారీగా ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. అచ్చెన్నాయుడు, లోకేశ్‌, సోమిరెడ్డి, రవిచంద్ర, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, చెంగల్‌రాయుడు సారథ్యంలో మొత్తం 97 మంది సీనియర్‌ నేతలు ఓ బృందంగా ఏర్పడ్డారు. నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. బూత్‌, మండలం, అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థాయిలను ఐదంచెలుగా ఏర్పాటుచేసి ఇప్పటికే కమిటీలు వేశారు. బూత్‌ స్థాయిలో 8వేల మంది కార్యకర్తలు, గ్రామస్థాయిలో వేయి మంది తమ పని మొదలుపెట్టారు. మండలస్థాయిలో 40 మంది నాయకులకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. తెదేపా అధికారిక సోషల్‌మీడియా విభాగం ఐటీడీపీ సామాజిక మాధ్యమాల్లో ప్రచార సరళిపై వ్యూహాలను సిద్ధం చేసింది. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఏర్పాటైన కమిటీలన్నీ సమన్వయంతో పనిచేసే వ్యవస్థను చంద్రబాబు ఏర్పాటుచేశారు.

అన్ని వర్గాలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, పెరిగిన నిత్యావసర ధరలు, ఎస్పీలపై అరాచకాలు, ఇసుక, లిక్కర్‌ మాఫియా వంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకొని ముందుకెళ్తామని తెలుగుదేశం పేర్కొంటోంది. అయితే కిందిస్థాయి నాయకులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని పార్టీ చంద్రబాబుకు చెబుతుండగా.. రాబిన్‌శర్మ బృందం మాత్రం అందుకు విరుద్ధమైన నివేదికలను అధినేతకు పంపుతున్నట్లు తెలుస్తోంది. నాయకులకు భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని, కార్యకర్తలను అధికార పార్టీ లక్ష్యంగా చేసుకుంటే వారికి తక్షణ న్యాయ సహాయం అందించేలా వ్యవస్థను రూపొందించాలని రాబిన్‌ శర్మ సూచించినట్లు సమాచారం.

ఇవీ చదవండి...

పార్టీపై రజినీకాంత్‌ సంచలన ప్రకటన

ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలు: చంద్రబాబు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని