చట్టప్రకారం 3 రాజధానులు సాధ్యంకాదు: గల్లా

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సమస్యలు, రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించినట్లు తెదేపా లోక్‌సభాపక్ష నేత గల్లా జయదేవ్‌ తెలిపారు.

Published : 25 Sep 2020 01:06 IST

దిల్లీలో తెదేపా ఎంపీల మీడియా సమావేశం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సమస్యలు, రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించినట్లు తెదేపా లోక్‌సభాపక్ష నేత గల్లా జయదేవ్‌ తెలిపారు. రాష్ట్రానికి మూడు రాజధానులు చట్ట ప్రకారం సాధ్యం కాదన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తినట్లు చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన సందర్భంగా తెదేపా ఎంపీలు దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్‌ మాట్లాడారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాను కలిసి అమరావతి విషయాన్ని ప్రస్తావించగా.. ఆయన తమ అభిప్రాయాలతో ఏకీభవించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు బాగా నిర్వహించారన్నారు. సభ్యులకు కరోనా సోకుతున్న నేపథ్యంలో పది రోజులకే సమావేశాలకు ముగింపు పలకాల్సివచ్చింది. జీఎస్టీ, పోలవరం నిధులు సహా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై సభలో ప్రస్తావించినట్లు గల్లా జయదేవ్‌ వివరించారు. ఇంగ్లీష్‌ మీడియం విద్యపై నిర్మాణాత్మక సూచనలు చేశామన్నారు. ఏపీలో దేవాలయాలు, దళితులపై దాడుల గురించి సభలో మాట్లాడామన్నారు. 23 బిల్లులపై తాము చర్చలో పాల్గొని అభిప్రాయాలను చెప్పామన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక సలహాలు ఇచ్చామని.. ఉద్యోగాలు దెబ్బతినకుండా ఉండేందుకు పలు సూచనలు చేసినట్లు జయదేవ్‌ తెలిపారు. 

దిల్లీలో జగన్‌ రహస్య మంతనాలు: రామ్మోహన్‌ నాయుడు

వైకాపా ఎంపీలు రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తి ఉంటే రాష్ట్రానికి న్యాయం జరిగేదని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత అజెండాను ముందుకు తీసుకెళ్లారని విమర్శించారు. వైకాపా ఎంపీలను సీఎం జగన్‌ తన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో రాష్ట్ర అజెండా ఎక్కడా మాట్లాడలేదన్నారు. సీఎం దిల్లీ వచ్చి రహస్య మంతనాలు నడిపారు తప్ప చేసిందేమీ లేదని రామ్మోహన్‌ ఆక్షేపించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మంచి వాతావరణం ఉండేదని.. వైకాపా వచ్చాక మత కలహాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో వైకాపా ఎంపీలు వారి నియోజకవర్గాల్లోకి వెళ్లలేని పరిస్థితి వస్తుందన్నారు. సీఎం రహస్య అజెండాతోనే దిల్లీ వస్తున్నారన్నారు. జీఎస్టీ బకాయిల విషయంలో భాజపా పాలిత రాష్ట్రాలు కూడా ధర్నా చేశాయని.. వైకాపా మాత్రం ఎందుకు ధర్నా చేయలేదని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు.

పార్లమెంట్‌ను వైకాపా పక్కదారిపట్టిస్తోంది: కనకమేడల

ఏపీ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు, రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడినట్లు చెప్పారు. పార్లమెంట్‌ను వైకాపా ఎంపీలు పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యసభలో కొవిడ్‌పై చర్చ జరిగితే ఎంపీ విజయసాయి రెడ్డి సభను ఒక రాజకీయ చర్చా వేదిక చేసుకొని మాట్లాడారని విమర్శించారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టి అమరావతి భూములపై సీబీఐ విచారణ అంటున్నారని మండిపడ్డారు. తితిదేని కూడా దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి నెలకొందని కనకమేడల ఆక్షేపించారు. పార్లమెంట్‌ సమావేశాలను వైకాపా రాజకీయ పబ్బం కోసం మాత్రమే వాడుకుందని ఆయన ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని