Priyanka Gandhi: ప్రియాంక పోటీ చేస్తే.. ఎక్కడి నుంచి? 

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారన్న సమాచారం

Published : 16 Sep 2021 09:46 IST

యూపీ రాజకీయాలు ఆసక్తికరం

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కూడా. ఇదే జరిగితే గాంధీ కుటుంబ సభ్యుల్లో అసెంబ్లీకి పోటీపడిన తొలి వ్యక్తి ఆమే అవుతారు. జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి రాహుల్‌ గాంధీ వరకు ప్రతి తరం సభ్యులు ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేశారు. ప్రియాంక ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కుటుంబాన్ని ఎంతో కాలంగా ఆదరిస్తున్న అమేఠీ లేదంటే రాయ్‌బరేలి అసెంబ్లీ స్థానాలను ఎంచుకోవచ్చని అంటున్నారు. ఇటీవల కాలంలో ఈ రెండు చోట్ల చురుగ్గా తిరుగుతుండడంతో ఆ అభిప్రాయం బలపడింది. అమేఠీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాహుల్‌ గాంధీని భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ ఓడించారు. ప్రియాంక అక్కడే పోటీ చేస్తే భాజపా నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అందువల్ల ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె రంగంలో ఉంటే కాంగ్రెస్‌ విజయావకాశాలు మెరుగుపడుతాయని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. 

కాంగ్రెస్‌ దరఖాస్తు ధర రూ.11 వేలు

అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అప్పుడే ప్రారంభించింది. టిక్కెట్‌ ఆశించే వారు రూ.11 వేలు చెల్లించి దరఖాస్తు ఫారం తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఈ నెల 25. వీటిని స్వీకరించే బాధ్యతలను పార్టీ నాయకులు సంజయ్‌ శర్మ, విజయ్‌ బహదూర్‌లకు అప్పగించారు.

భాజపా.. బీఎస్పీ లోపాయికారీ ఒప్పందం?

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ముందు భాజపా, బీఎస్పీ మధ్య లోపాయికారీ ఒప్పందాలు నడుస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ ఇటీవల కార్యక్రమంలో బీఎస్పీని ప్రశంసించడమే కాకుండా ఆ పార్టీ ఒక బలమైన పార్టీ అని కూడా కితాబిచ్చారు. ఇటీవల రాయబరేలిలో భాజపా నిర్వహించిన జ్ఞానోదయ సమావేశాల్లో కూడా భాజపాకు చెందిన రాష్ట్ర మంత్రి ఒకరు బీఎస్పీని ప్రశంసించారు. ఈ పరిణామాలన్నీ రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యాన్ని చూపుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించడంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మెతకవైఖరి అవలంబించడం కూడా దీన్ని ధ్రువీకరిస్తోందని ప్రతిపక్షాలు సయితం భావిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని