3న దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం: కిషన్‌రెడ్డి

దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 31 Oct 2020 01:15 IST

 

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. దుబ్బాకలో ప్రచారం ముగించుకున్న అనంతరం సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా ప్రజల మద్దతుపై ఆధారపడి పోటీ చేస్తుంటే తెరాస అధికారంపై ఆధారపడిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గం సవతితల్లి ప్రేమకు గురైందని వ్యాఖ్యానించారు. భాజపాకు డిపాజిట్‌ రాదంటూ తెరాస దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందపడ్డా మాదే పైచేయి అన్నట్టు అధికార పార్టీ వ్యవహరిస్తోందన్నారు. 

కాంగ్రెస్‌ పోటీలో ఉన్నా లేకున్నా తేడా లేదు

కాంగ్రెస్‌ పార్టీ పోటీలో ఉన్నా .. లేకున్నా తేడాలేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 2018 ఎన్నికల్లో 19 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే సగానికంటే ఎక్కువ మంది తెరాసలో చేరారని విమర్శించారు. ఓటు కాంగ్రెస్‌కు వేసినా తెరాసకు వేసినా ఒక్కటేనన్నారు. రఘునందన్‌ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓటమిపాలైనా ప్రజల్లోనే ఉంటూ సమస్యలపై పోరాటం చేశారని కిషన్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో రఘునందన్‌ ప్రజాగొంతుక అవుతారన్నారు. పోలింగ్‌ రోజు నవంబర్‌ 3న దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం జరగనుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలో ప్రలోభాలు, ధన ప్రవాహం లేకుండా ఈసీ చర్యలు చేపట్టాలని కోరారు. 

ఎన్ని ఇళ్లు కడితే అన్నింటికీ కేంద్రం వాటా

‘‘మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలకూ సమాన అవకాశాలు ఇస్తాం. తెలంగాణ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి పేదవాడికి కేంద్ర ప్రభుత్వం రూ.3కు కిలో బియ్యం ఇస్తోంది. గ్రామాలు, పురపాలికలకు నేరుగా నిధులు అందిస్తోంది. తెరాస ప్రభుత్వం ఎన్ని ఇళ్లు కడితే అన్నింటికీ కేంద్రం వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రెండు పడకగదుల ఇళ్ల పథకం ప్రారంభించి ఏడేళ్లు అయినా ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుడి పేరూ కేంద్రానికి పంపలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం పింఛన్లలోనూ కేంద్రం వాటా ఉంది.  కనీసం విశ్వవిద్యాలయాలకు వీసీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించలేకపోతోంది. అప్పుల్లో తెలంగాణ అభివృద్ధి చెందింది. అవినీతి, మద్యం అమ్మకాలు, నిరుద్యోగం, కుటుంబ పాలనలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని