ఏపీలో కాలుష్యం బారిన 13 నగరాలు!

ఆంధ్రప్రదేశ్‌లో 13 నగరాలు కాలుష్యం బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి

Updated : 14 Sep 2020 20:07 IST

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 13 నగరాలు కాలుష్యం బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2014 నుంచి 2018 మధ్య దేశంలోని వివిధ నగరాలలో గాలి నాణ్యతపై జరిపిన అధ్యయనంలో భాగంగా రాష్ట్రంలోని 13 నగరాల్లో కాలుష్యం పెరిగిందని చెప్పారు. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో స్వచ్ఛమైన గాలి నాణ్యత అత్యల్పంగా ఉన్నట్లు గుర్తించామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌కాప్‌) కింద కాలుష్యం బారిన పడిన నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఎన్‌కాప్‌లో భాగంగా వాయు కాలుష్యం బారినపడిన నగరాల్లో కాలుష్యం వెదజల్లేందుకు ప్రధాన కారణాలను గుర్తించడానికి పలు అధ్యయనాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. రోడ్లపై ఆవరించే ధూళి కణాలు, వాహన కాలుష్యం, చెత్త తగులబెట్టడం, నిర్మాణ, కూల్చివేత పనులు, పారిశ్రామిక కాలుష్యం వంటివి నగరాలలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు సభకు ఆయన వివరించారు. వాయుకాలుష్యం నుంచి నగరాలను కాపాడి గాలి నాణ్యతను మెరుగు పరిచేందుకు నగరాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు బాబుల్‌ సుప్రియో లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు కుళాయి కనెక్షన్‌

జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద 2024 నాటికి ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఇళ్లకు మంచినీటి కుళాయి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 2024 నాటికి 63.72లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు కల్పించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వార్షిక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఈ ప్రణాళిక కింద ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో 31.93లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీటి సదుపాయం కల్పించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు కూడా ఆటంకమేర్పడిందన్నారు. అన్‌లాక్‌లో నిర్మాణ పనుల ప్రారంభానికి అనుమతించిన తర్వాత జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని రతన్‌లాల్‌ కటారియా అందులో వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.32కోట్ల ఇళ్లకు కుళాయి కనెక్షన్‌ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగించేందుకు రాష్ట్రాలకు తగినన్ని నిధులు అందుబాటులో ఉంచినట్లు లిఖితపూర్వక సమాధానంలో కేంద్రమంత్రి తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని