‘భాజపా, జేడీయూ పొత్తుకు ప్రమాదం లేదు’

బిహార్‌లో భాజపా, జేడీయూల పొత్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆ రాష్ట్ర భాజపా నేత సుశీల్‌ కుమార్‌ మోదీ స్పష్టం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భాజపా సంకీర్ణ ధర్మాలకు కట్టుబడి లేదని జేడీయూ ఆ పార్టీపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Published : 29 Dec 2020 01:24 IST

పట్నా: బిహార్‌లో భాజపా, జేడీయూల పొత్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆ రాష్ట్ర భాజపా నేత సుశీల్‌ కుమార్‌ మోదీ స్పష్టం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భాజపా సంకీర్ణ ధర్మాలకు కట్టుబడి లేదని జేడీయూ ఆ పార్టీపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు ఆయన సోమవారం ఓ కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడారు. ‘బిహార్‌లో భాజపా, జేడీయూల మధ్య మంచి అనుబంధం ఉంది. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విడదీయరానిది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల ప్రభావం ఇక్కడ ఉండదు’ అని సుశీల్‌ మోదీ వెల్లడించారు. 

బిహార్‌ ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాల గురించి సుశీల్‌ మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో నీతీశ్‌కుమార్‌ తాను సీఎం కావాలనుకోవడం లేదని చెప్పారు. భాజపాకు చెందిన వారే సీఎం కావాలని కోరారు. కానీ అప్పటికే ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా సీఎంగా ఆయన పేరునే ఖరారు చేసింది. కాబట్టి భాజపా, జేడీయూ, వీఐపీల విజ్ఞప్తి మేరకు ఆయన అంగీకరించారు’అని మోదీ తెలిపారు. 

గత వారం అరుణాచల్‌లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు భాజపాలో చేరిన విషయం తెలిసిందే.  దీంతో 60 సభ్యులు ఉన్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో భాజపా బలం 48కి చేరగా.. జేడీయూకు ఒకే ఎమ్మెల్యే మిగిలారు. దీనిపై ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్‌ తివారీ మాట్లాడుతూ.. ‘ఇదే తరహా పరిణామాలు బిహార్‌లోనూ సంభవించవచ్చు. భాజపా కూటమి ధర్మాలను ఉల్లంఘిస్తోంది’ అని ఆరోపించారు.  

ఇదీ చదవండి

ప్రభుత్వ నిర్ణయం వెనుక కుట్ర: బండి సంజయ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని