
యోగికి సీఎంగా కొనసాగే హక్కులేదు:ప్రియాంక
హాథ్రస్: యూపీలోని హాథ్రస్లో యువతిపై జరిగిన అమానవీయ ఘటనానంతరం పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కామాంధుల దాహానికి బలైపోయిన ఆ యువతి భౌతికకాయానికి అంత్యక్రియలు కూడా చేసుకొనే అవకాశం కుటుంబానికి కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించడంపై మండిపడుతూ ప్రియాంక వరుస ట్వీట్లు చేశారు. యోగి ఆదిత్యనాథ్కు యూపీ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కులేదన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రియాంక డిమాండ్ చేశారు. ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన యువతి శారీరక, మానసిక వేదనతో దిల్లీలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నిన్న ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు తెల్లవారు జామున ఆమె మృతదేహానికి పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, బాధితురాలి కుటుంబం ఇష్టప్రకారమే అంత్యక్రియలు నిర్వహించామని ఓ పోలీస్ అధికారి చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తాను హాథ్రస్ బాధితురాలి తండ్రితో తాను ఫోన్లో మాట్లాడినట్టు ప్రియాంక ట్విటర్లో పేర్కొన్నారు. తన కుమార్తె చనిపోయిందని పేర్కొంటూ ఆ తండ్రి వేదన చెందారని తెలిపారు. తమ బిడ్డకు న్యాయం జరగాలని ఆ కుటుంబం కోరుకుంటోందని చెప్పారు. యువతి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నట్టు తనతో చెప్పారని ప్రియాంక తెలిపారు. బాధితురాలిని, ఆ కుటుంబ సభ్యులను రక్షించడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రతి హక్కునూ హరించేలా వ్యవహరించిందని విమర్శించారు. అందువల్ల సీఎంగా కొనసాగే నైతిక హక్కు యోగి ఆదిత్యనాథ్కు లేదన్నారు. బాధితురాలు ప్రాణాలతో ఉన్నప్పుడు కూడా సరైన రక్షణ కల్పించలేదని.. సకాలంలో వైద్య చికిత్సలు సైతం అందించలేదని ఆరోపించారు. ఆ అభాగ్యురాలికి అంతిమ కర్మలు చేసుకొనే ఆ కుటుంబ హక్కును కూడా లేకుండా చేశారంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.