AAP: ‘జాడూ’ ఊడ్చలేకపోయినా.. జాతీయపార్టీ హోదా దక్కింది..!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)కి ఘోర పరాభవం ఎదురైంది. గుజరాత్‌లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన ఆప్‌.. హిమాచల్‌లో కనీసం ఖాతా తెరవలేకపోయింది.

Updated : 08 Dec 2022 15:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి తర్వాత దేశంలో భాజపా(BJP) ప్రత్యామ్నాయం లేదా? అనే సందేహాలు పుట్టుకొచ్చాయి. సరిగ్గా అదే సమయంలో తెరపైకి వచ్చింది ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP). దశాబ్దం క్రితం అన్నాహజారే ప్రారంభించిన జన్‌లోక్‌పాల్‌ ఉద్యమం ద్వారా ప్రాచుర్యం పొందిన కేజ్రీవాల్‌ ఆప్‌ను స్థాపించారు. దిల్లీ గల్లిలో పుట్టిన ఈ పార్టీ.. అంచెలంచెలుగా ఎదుగుతూ పలు రాష్ట్రాలకు విస్తరించింది. ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. తాజాగా జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటి భాజపాకు ప్రత్యామ్నాయంగా అవతరించాలని కలలుకంది. కానీ ఆప్‌ ఆకాంక్షలకు బ్రేక్‌ పడింది. తాజా ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ ఆశలపై ఓటర్లు నీళ్లుచల్లారు. ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని ఆప్‌.. గుజరాత్‌ (Gujarat)లో మూడో స్థానానికి పరిమితం కాగా.. హిమాచల్‌ (Himachal Pradesh)లో కనీసం ఖాతా తెరవలేకపోయింది.

పనిచేయని ‘పంజాబ్’ వ్యూహం..

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల విజయం ఇచ్చిన జోరుతో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. తమ లక్ష్యం భాజపాను ఓడించడమే అని చెబుతూ ఏకంగా అన్ని స్థానాల్లో బరిలోకి దిగింది. అదే సమయంలో హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. కానీ, ఆప్‌ దృష్టంతా గుజరాత్‌పైనే. అందుకే.. ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా సహా పార్టీ కీలక నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. పంజాబ్‌ మాదిరిగానే గుజరాత్‌లోనూ ఉచిత విద్య, ఉచిత విద్యుత్‌ అంటూ వరాలు గుప్పించింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా తరచూగా గుజరాత్‌లో పర్యటించడమే గాక.. పంజాబ్‌లో ఉచిత విద్యుత్‌కు సంబంధించిన ప్రజల కరెంటు బిల్లులును తీసుకొచ్చి మరీ ప్రచారం చేశారు. కానీ ఈ వ్యూహాలేవీ ఆమ్‌ ఆద్మీకి ఫలితాన్నివ్వలేదు. కేవలం ఓట్లను చీల్చడంలో తప్ప ఈ పార్టీ గుజరాత్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. తాజా ఎన్నికల్లో కనీసం రెండంకెల స్థానాలను కూడా దక్కించుకోలేకపోయిందంటే.. రాష్ట్రంలో ఈ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇక, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఆమ్‌ ఆద్మీకి భంగపాటు తప్పలేదు. ఈ ఎన్నికల సమయంలో దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. దీంతో హిమాచల్‌ ప్రదేశ్‌పై ఆమ్‌ ఆద్మీ దృష్టిసారించలేకపోయింది. ప్రచారం చేసింది కూడా అంతంతమాత్రమే. ఫలితంగా ఈ రాష్ట్రంలో ఆప్‌ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.

ఇబ్బందిపెట్టిన అవినీతి మరకలు..

అవినీతిపై వ్యతిరేక ఉద్యమం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఆ తర్వాత సాధారణ రాజకీయ పార్టీగా అవతరించిందనడంలో సందేహం లేదు. ఆ పార్టీలోనూ వ్యక్తి పూజ ప్రారంభమైంది. ప్రకటనల్లోనూ కేజ్రీవాలే ప్రధానంగా కనిపించేవారు. ప్రచారం కోసం భారీగా ఖర్చు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. లోక్‌పాల్‌ బిల్లుపై పుట్టుకొచ్చిన ఆ పార్టీ.. దిల్లీలో ఇంతవరకు దాన్ని తీసుకురాలేదు. ఇక అవినీతి మరకలు కూడా పార్టీని వేధించాయి. గుజరాత్‌ ఎన్నికల సమయంలో దిల్లీలో బయటపడిన మద్యం కుంభకోణం.. పార్టీపై తీవ్ర ప్రభావమే చూపించింది. కీలక మంత్రులు సత్యేందర్‌ జైన్‌, మనీశ్ సిసోదియా వంటివారిపై కేసులు నమోదవ్వడం.. ఆమ్‌ ఆద్మీ ప్రాభవాన్ని దెబ్బకొట్టింది. ప్రతిపక్షాలపై జాతీయ సంస్థలను ప్రయోగిస్తున్నారంటూ భాజపాపై వచ్చిన విమర్శలను ఆప్‌ బలమైన అస్త్రాలుగా మార్చుకోలేకపోయింది.

‘జాతీయ’ ఊరట..

అయితే, ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కొద్దిలో కొంత దక్కిన సంతోషం ఏంటంటే.. ‘జాతీయ’ హోదా దక్కేందుకు మార్గం లభించడం. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు సాధించాలంటే.. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు సాధించాలి. ప్రస్తుతం ఆప్‌.. దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. ఈ ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు, 6శాతం ఓటు షేరు దక్కించుకుంది. ఇప్పుడు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచి 12 శాతం ఓటు షేరు సాధించింది. దీంతో జాతీయ పార్టీగా అవతరించేందుకు అర్హత సాధించినట్లైంది.

మొత్తానికి 2024 ఎన్నికల్లో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొనేందుకు అవసరమైన బూస్ట్‌ను మాత్రం ఈ ఫలితాలు అందించలేకపోయాయనే చెప్పాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని