Gujarat elections 2022: ‘సోషల్‌’ వార్‌లో ఆప్‌దే పైచేయి.. రాహుల్‌పైనే కాంగ్రెస్‌ ఫోకస్‌!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ దృష్టి సారించింది. అటు బహిరంగ సభలు, రోడ్‌షోలే కాదు.. సామాజిక మాధ్యమ ఖాతాలను సైతం గట్టిగానే వాడుకుంటోంది. ఈ విషయంలో కాంగ్రెస్‌, భాజపా వెనకబడ్డాయి.

Published : 29 Nov 2022 18:16 IST

దిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల (Gujarat elections 2022)పై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) గట్టి ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం విషయంలో భాజపా, కాంగ్రెస్‌తో పోలిస్తే ముందు వరుసలో నిలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ప్రధాన ఖాతాల్లో పోస్టులు, ట్వీట్లలో చాలా వరకు గుజరాత్‌ ఎన్నికల కోలాహలమే కనిపిస్తుండడం ఇందుకు నిదర్శనం. ఈ విషయంలో భాజపా రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్‌ మాత్రం రాహుల్‌ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’పై దృష్టి కేంద్రీకరించింది.

గుజరాత్‌లోని 1, 5 తేదీల్లో రెండు విడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తొలి విడతకు నేటితో ప్రచార గడువు ముగియనుంది. ఇన్నాళ్లూ బహిరంగ సభలు, రోడ్‌ షోలతో హోరెత్తించిన పార్టీలు.. అటు సోషల్‌ మీడియానూ గట్టిగానే వాడుకుంటున్నాయి. ఈ క్రమంలో గతవారం (21-27) మధ్య ఆయా పార్టీల సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించినప్పుడు ఆసక్తికర గణంకాలు వెలువడ్డాయి.

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ట్విటర్‌ ఖాతాకు 9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌ను 6.3 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. వారం పాటు ఆ పార్టీ సామాజిక మాధ్యమ పోస్టులను పరిశీలిస్తే.. రాహుల్‌పైనే ఆ పార్టీ దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. ఈ వారం రోజుల్లో 280 ట్వీట్లు ఆ పార్టీ ఖాతా నుంచి వెలువడితే అందులో కేవలం 42 మాత్రమే గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. మొత్తం 242 ఫేస్‌బుక్‌ పోస్టులు రాగా.. అందులో కేవలం 53 మాత్రమే గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించినవి ఉండడం గమనార్హం. 198 ట్వీట్లు, 194 ఫేస్‌బుక్‌ పోస్టులు అంటే దాదాపు 75 శాతం పోస్టులు రాహుల్‌ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’కు సంబంధించినవే ఉన్నాయి.

మరో జాతీయ పార్టీ భాజపా ట్విటర్‌ ఖాతాకు 19.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌ను 16 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ట్విటర్‌లో 40 శాతం, ఫేస్‌బుక్‌లో 35 శాతం పోస్టులు గుజరాత్‌ ఎన్నికకు సంబంధించినవి ఉన్నాయి. గత వారం ఆ పార్టీ పెట్టిన 169 ఫేస్‌బుక్‌ పోస్టుల్లో 63 పోస్టులు గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించినవి పోస్టు చేయడం గమనార్హం.

ఆప్‌ మాత్రం ఈ విషయంలో ముందు వరుసలో నిలిచింది. ఆ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రచారంలో పాల్గొన్న ప్రధాన ర్యాలీలన్నింటినీ ఆ పార్టీ సోషల్‌ మీడియా ద్వారా కవర్‌ చేసింది. ఆ పార్టీ ప్రధాన ఖాతాల నుంచి వెలువడిన సగానికి పైగా ట్వీట్లు, పోస్టులు గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించినవే ఉండడం బట్టి ఈ ఎన్నికలకు ఆ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం అర్థమవుతోంది. ఆప్‌ ట్విటర్‌ను 6.4 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌ను 5.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. గతవారం ఆ పార్టీ ట్విటర్‌ నుంచి 260 ట్వీట్లు వెలువడగా.. అందులో 131 ట్వీట్లు గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించినవే. 156 ఫేస్‌బుక్‌ పోస్టుల్లో 81 గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించినవి ఉన్నాయి. ఆదివారం ఆ పార్టీ నుంచి వెలువడిన సోషల్‌ మీడియా పోస్టుల్లో 95 శాతం గుజరాత్‌పైనే ఉండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని