Delhi MCD Elections: దిల్లీలో కాషాయ కోటను బద్దలుకొట్టిన కేజ్రీవాల్‌

దిల్లీ(Delhi) మున్సిపల్‌ కార్పొరేషన్ (MCD Elections) ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో 133 స్థానాల్లో గెలుపొంది మేయర్‌ సీటు దక్కించుకుంది.

Updated : 07 Dec 2022 14:59 IST

మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జయకేతనం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi) మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MCD Elections)లో 15 ఏళ్ల భాజపా (BJP) పాలనను ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఊడ్చేసింది. బుధవారం వెలువడిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను దాటి.. ఆప్‌ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది. ఈ ఎన్నికల్లో భాజపా 104 వార్డులను గెలుచుకోగా.. ఆ పార్టీ దిల్లీ చీఫ్‌ ఆదేశ్ గుప్తా నియోజకవర్గం పటేల్‌ నగర్‌లోని నాలుగు వార్డుల్లోనూ కాషాయ పార్టీ ఓటమిపాలవ్వడం గమనార్హం. ఇక కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఈ ఫలితాల్లో హస్తం పార్టీ కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. మరో మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు.

1958లో ఏర్పాటైన ఎంసీడీ (MCD)ని 2012లో నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. మే 22 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో దశాబ్దంన్నర పాటు భాజపానే అధికారంలో ఉంది. 2017 మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా 181 స్థానాల్లో గెలుపొందింది. ఆప్‌ 48, కాంగ్రెస్‌ 27 వార్డుల్ని కైవసం చేసుకున్నాయి.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న వేళ.. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఆప్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ కార్యాలయం వద్ద ఆప్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో విజయం పట్ల ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

* మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీపై విశ్వాసం చూపించినందుకు దిల్లీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల తీర్పుతో మేం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పార్టీని ఓడించగలిగాం. ఇది మాకు కేవలం విజయం మాత్రమే కాదు. ఓ పెద్ద బాధ్యత - దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా

* దిల్లీ అసెంబ్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను అరవింద్‌ కేజ్రీవాల్‌ పెకిలించారు. ఇప్పుడు దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భాజపాను కూడా గద్దెదించారు. విద్వేష రాజకీయాలను దిల్లీ ప్రజలు ఇష్టపడటం లేదని రుజువైంది. స్కూళ్లు, ఆసుపత్రులు, విద్యుత్‌, పరిశుభ్రతకే వారు ఓటేశారు - పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌

* భాజపాకు దిల్లీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అభివృద్ధి కోసం పనిచేసిన వారికే ఓటేశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌పై భాజపా చల్లుతున్న బురదను ప్రజలు తుడిచేశారు. ఇక, మేం దిల్లీని ప్రపంచంలోనే అందమైన నగరంగా మారుస్తాం - ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని