మభ్యపెట్టి తక్కువ ధరకు లాక్కున్నారు: ఆళ్ల

అమరావతిలో దళిత రైతుల నుంచి భూములు లాక్కోవడంలో ప్రమేయమున్న వారిందరినీ వెంటనే అరెస్టు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు...

Updated : 04 Jul 2021 19:17 IST

విజయవాడ: అమరావతిలో దళిత రైతుల నుంచి భూములు లాక్కోవడంలో ప్రమేయమున్న వారిందరినీ వెంటనే అరెస్టు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అమరావతిలో దళితులెవరూ ఉండకూడదని భావించిన తెదేపా అధినేత చంద్రబాబు.. తన అనుయాయుల ద్వారా పక్కాగా పథకం పన్ని భూములను లాక్కున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను రంగంలోకి దింపిన చంద్రబాబు.. అసైన్డ్‌ భూములు కలిగిన రైతులకు ప్యాకేజీలు రావని మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు లాక్కున్నారన్నారు. భూములన్నీ తమవారి చేతుల్లోకి రాగానే ప్యాకేజీలు ఇప్పించుకున్నారని ఆక్షేపించారు. ఈ వ్యవహారంలో మంగళగిరిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్రహ్మానందరెడ్డి ప్రధాన పాత్ర పోషించారని ఆళ్ల తెలిపారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లిలోని అసైన్డ్ భూములను గుర్తించి రైతులను బెదిరించి లాక్కున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆళ్ల మీడియా ముందు ప్రదర్శించారు.

ఈ వ్యవహారంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, అధికారులు కలసి దళితులను మోసం చేశారన్నారు. అప్పటి గుంటూరు కలెక్టర్లు కోన శశిధర్, కాంతిలాల్ దండే.. ఈ అక్రమాలను అడ్డుకోకుండా చూస్తూ ఊరుకున్నారని పేర్కొన్నారు. ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి ద్వారా రహస్యంగా రికార్డులు తెప్పించుకొని రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములను కొట్టేశారని ఆరోపించారు. ఈ కుట్రతో సంబంధం ఉన్న ఐఏఎస్‌లు, గ్రూప్-1 అధికారులు సహా ఏ ఒక్కరినీ వదలిపెట్టపెట్టొద్దని పోలీసులను కోరారు. తన వద్ద ఉన్న ఆధారాలను సీఐడీ అధికారులకు అందించనున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని