JKకు తగిన సమయంలో రాష్ట్రహోదా: అమిత్‌ షా

కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌పై కేంద్రహోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై......

Updated : 13 Feb 2021 16:30 IST

జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

దిల్లీ: కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో ప్రసంగించిన ఆయన.. సరైన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదన్నారు. రాష్ట్ర హోదా ఇవ్వబోమని ఈ బిల్లులో ఎక్కడా లేదని, దీనిపై విపక్షాలు వక్రభాష్యాలు చెబుతున్నాయంటూ మండిపడ్డారు. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్‌ ఏంచేసిందని ప్రశ్నించారు. హింస, అశాంతితో కూడిన పాత రోజులు కశ్మీర్‌లో మళ్లీ రావన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అధికార పంపిణీ జరుగుతోందన్నారు. పంచాయతీలకు పరిపాలన, ఆర్థికపరమైన అధికారాలు కల్పించినట్టు తెలిపారు. జమ్మూకశ్మీర్‌పై ప్రతి అంశానికీ వివరణ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిపై దృష్టిపెట్టిందన్నారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే మోదీ సర్కార్‌ ప్రాథమ్యమని తెలిపారు. పునర్‌ వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు సభ్యులు ఈ ప్రాంతం తిరిగి రాష్ట్ర హోదా పొందుతుందన్న విశ్వాసం తమకు లేదంటూ చేసిన వ్యాఖ్యలకు ఆయన సమాధానమిచ్చారు. తగిన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో అధికార పంపిణీ, అధికార వికేంద్రీకరణ జరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 51శాతానికి పైగా పోలింగ్‌ జరగడాన్ని ఆయన ప్రస్తావించారు. తమ ప్రత్యర్థులు కూడా ఎత్తిచూపని విధంగా ఎన్నికలు శాంతియుతంగా జరిగాయని తెలిపారు. 

2022 కల్లా 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు!

ఈ ప్రాంతంలో రెండు ఎయిమ్స్‌ పనులు ప్రారంభమయ్యాయని, కశ్మీర్‌ వ్యాలీకి 2022 కల్లా రైలు మార్గం ఏర్పాటవుతుందని చెప్పారు. అక్కడి ప్రజలెవరికీ భూములు కోల్పోతామన్న ఆందోళన అవసరం లేదన్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు. 2022 నాటికి జమ్మూకశ్మీర్‌లో 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అనంతరం జమ్మూకశ్మీర్‌  పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ‌

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన  సందర్భంగా అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదీ చదవండి..

సామాన్యులే మా మిత్రులు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని