Amit shah: హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై అమిత్‌ షా ట్వీట్‌

హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా బలపరిచిన అభ్యర్థి విజయం.. అక్కడి ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనడానికి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.

Published : 17 Mar 2023 18:04 IST

దిల్లీ: ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక (MLC elections)లో భాజపా బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit shah) హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ఏవీఎన్‌ రెడ్డికి, ఆయన గెలుపు కోసం పనిచేసిన భాజపా శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని, ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయమే తెలియజేస్తోందని పేర్కొన్నారు.  మార్చి 13న ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా.. గురువారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో భాజపా బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించారు.

బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గుణపాఠం తప్పదు: బండి

భాజపా అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డిని గెలిపించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ధర్మం వైపు నిలబడిన ఉపాధ్యాయులు, అధ్యాపకులదిగా పేర్కొన్నారు. టీచర్లలో పేరుకుపోయిన ప్రభుత్వ వ్యతిరేకతకు ఇదే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ కళ్లు తెరిచి ఉపాధ్యాయుల సమస్యలకు చొరవచూపాలని కోరారు. నియంతృత్వ పోకడలకు పోతున్న భారాస సర్కార్‌కు తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే పునరావృతం అవుతాయన్న విశ్వాసాన్ని ఉపాధ్యాయులు అందించారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని